ఆ ఎమ్మెల్యేలకు సిఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..!

ఏపీలో మద్యం నూతన పాలసీ విధానాన్ని ప్రభుత్వం రేపటినుండి ప్రవేశపెడుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే అందుకు సంబంధించి ఇప్పటికే నూతన విధాన ప్రక్రియలో భాగంగా దరఖాస్తులను స్వీకరించి.. లాటరీ పద్ధతిని సైతం అన్ని జిల్లాలలో అధికారులు నిర్వహించారు. ఈ లాటరీ పద్ధతి కార్యక్రమాన్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించగా.. పలుచోట్ల జరిగిన ఘటనల ఆధారంగా ప్రభుత్వం సీరియస్ అయింది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు.. పరోక్షంగా మద్యం దుకాణాలను దక్కించుకున్న వారిని బెదిరిస్తున్నట్లు సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు.. తానే రంగంలోకి దిగి.. పలువురు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.

 

ఏపీలోని అన్ని జిల్లాలకు సంబంధించి మద్యం షాపుల లైసెన్సుల కోసం 89,882 దరఖాస్తులు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. మొత్తం 3396 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిన షాపుల లైసెన్సులను అధికారులు ప్రకటించేశారు. ఈ లాటరీ పద్ధతి ద్వారా సుమారు 300 మందికి పైగా మహిళలు సైతం షాపులను దక్కించుకోవడం విశేషం.

 

అయితే శ్రీ సత్య సాయి జిల్లాలో ఓ వ్యక్తి మద్యం దుకాణాన్ని లాటరీ ద్వారా దక్కించుకున్న వెంటనే.. బయటకు వచ్చిన క్రమంలో అదృశ్యమయ్యాడు. వెంటనే అతని భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసి.. తన భర్త ఆచూకీ కనుగొనాలని పోలీసులను కోరింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సదరు వ్యక్తి అదృశ్యం వెనుక.. టిడిపి నేతలు ఉన్నట్లు వైసీపీ జోరుగా ప్రచారం సాగిస్తోంది. అంతేకాకుండా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు.. పరోక్షంగా ఉంటూ మద్యం షాపులను దక్కించుకునేందుకు ప్రయత్నించారన్న వార్తలు సైతం పలు జిల్లాలలో వినిపించాయి.

 

ఇప్పటికే మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు పలుమార్లు ఎమ్మెల్యేలకు సూచించారు. తాజాగా మద్యం షాపుల లైసెన్సులకు సంబంధించి పలువురు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు వినిపించడంతో.. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నేరుగా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. తమ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, మద్యం షాపులను దక్కించుకున్న వారికి ఎవరైనా అవరోధం కలిగిస్తే.. ఊరుకునే ప్రసక్తే లేదంటూ చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇంటెలిజెన్స్ వర్గాల నుండి అందుకు సంబంధించిన నివేదిక తెప్పించుకుని, చంద్రబాబు తన వద్ద ఉంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఈనెల 18వ తేదీన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో సీఎం చంద్రబాబు భేటీ కానుండగా.. మద్యం వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యేలకు స్పెషల్ క్లాస్ ఉంటుందని టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి. కాగా ఈ భేటీలో పార్టీ బలోపేతం కావడంపై చర్చించడం, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ నేతలను సమాయత్తం చేసేందుకు సీఎం కీలక సూచనలు చేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతున్నందున, ఎవరైనా టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే వేరే పార్టీ నేతలకు సమాధానం ఇచ్చేస్థాయికి రాకూడదన్నది టీడీపీ అధిష్టానం అభిప్రాయంగా తెలుస్తోంది. గీత దాటితే సహించని నైజం గల చంద్రబాబు.. ఈ విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *