తెలంగాణలో మరోసారి కుటుంబ సర్వే..!

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. కాగా, సర్వే బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగించారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.

 

ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్

 

తెలంగాణ రాష్టంలో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను కమిషన్ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. ఉపకులాల వారీగా ఎస్సీల వెనకబాటుతనాన్ని కమిషన్ అధ్యయనం చేయనుంది. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించిన విషయం తెలిసిందే.

 

ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై జీవో జారీ

 

తెలంగాణలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ ఛైర్మన్‌గా మున్సిపాలిటీ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీసర్ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్‌గా ఉంటారని జీవోలో ప్రభుత్వం తెలిపింది.

 

ఇద్దరు ఎస్‌హెచ్‌జీ గ్రూప్ సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనసాగనున్న ఈ కమిటీలు.. లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాయి.శనివారం నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కమిటీల కోసం పేర్లు పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *