భూసమస్యలకు పరిష్కారంగా కేసీఆర్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చింది. అయితే, ఇది వచ్చాకే కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దీనిని రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించింది. అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పింది. తాజాగా దీనికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ధరణి పోర్టల్ను రద్దు చేస్తున్నామని, త్వరలోనే ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తామని తెలిపారు.
ఈ నెలాఖరులోగా ఇది అమల్లోకి తెచ్చేలా చూస్తామన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా కొత్త చట్టాన్ని రూపొందించామన్న పొంగులేటి, ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా రుణమాఫీ, ఇళ్ల పంపిణీపైనా మాట్లాడారు మంత్రి. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకాన్ని గాలికొదిలేసిందన్నారు. పూర్తయిన ఇండ్లను దసరా లోపు అందజేస్తామని, వెంటనే మరమ్మతులు, మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 3500 నుంచి 4 వేల ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు వివరించారు.
ప్రతిపక్షాల సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే తమ ప్రభుత్వానికి 10 నెలలు పూర్తవుతుందని చెప్పిన పొంగులేటి, దసరా లోపే పైలెట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ కార్డులు ఇస్తున్నట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ స్మార్ట్ కార్డు పథకాలు అందుతాయని అన్నారు. స్మార్ట్ కార్డు ద్వారానే ఉచిత కరెంట్, రేషన్ కార్డు, హెల్త్ కార్డు పని చేస్తుందని తెలిపారు.
జనవరి మొదటి వారం నుంచి దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం ఇస్తామని, నాలుగేళ్లలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని చెప్పారు. అలాగే, రుణమాఫీ కాని వారికి ఎదురైన టెక్నికల్ సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తామని తెలిపారు.