ముంబయి నటి కాదంబరి కేసులో కీలక పరిణామం… నేడో రేపో సీఐడీ చేతికి..?

ముంబయి నటీమణి కాదంబరి జెత్వాని కేసు కీలక మలుపు తీసుకోనుంది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే ఉత్తర్వులు వెల్లడయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నాయి.

 

ఈ కేసులో నలుగురు పోలీసులతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు, మరో న్యాయవాది మొత్తం ఐదుగురు వ్యక్తులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం, వాదనలు పూర్తి చేసినట్లు సమాచారం.

 

ఈ మేరకు తీర్పును రిజర్వు చేస్తూ అక్టోబర్ 4న వెలువరిస్తామని కోర్టు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు గత 15 రోజులుగా ఈ కేసుకు సంబంధించి ఏపీ ఉన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. వాస్తవానికి ఈరోజు వరకు సదరు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.

 

సీనియర్ ఐపీఎస్ అధికారి పాత్ర ఉన్న నేపథ్యంలోనే ఈ కేసును ఏపీసీఐడీకి అప్పగించేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధింపులకు గురి చేశారని ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నిపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసుకు సంబంధించి దిగువస్థాయిలో ఇన్‌స్పెక్టర్లు, ఆ కింద స్థాయి అధికారులు అప్రూవర్‌లుగా మారడంతో ముగ్గురు ఐపీఎస్‌లకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు.

 

కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ఐపీఎస్‌లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, అందుకు చాలా ప్రోసీజర్లను అనుసరించాలని యూపీఎస్సీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాతే ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులపై చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. ఈ వ్యవహారంపై కాదంబరి జెత్వాని ఫిర్యాదుతో కదిలిన పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఈ కారణంగానే సీఐడీ విచారణకు ప్రభుత్వం నేడో రేపో ఉత్తర్వులు విడుదల చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *