మహేష్- రాజమౌళి సినిమాలో కార్తీ..?

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. చాలాకాలం తరువాత సత్యం సుందరం సినిమాతో హిట్ ను అందుకున్నాడు. దేవర సినిమాతో పోటీగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. అందుకు ఒక కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. నిజం చెప్పాలంటే.. ఈ సినిమాకు అంత హైప్ లేదు. ఆ సమయంలో దేవర సినిమాపై తప్ప ఇంకే సినిమాను కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రేక్షకులు. అలాంటి సమయంలోనే పవన్.. తిరుపతి లడ్డూ వివాదంలోకి కార్తీని లాకొచ్చి.. ఈ సినిమాపై బజ్ ను తీసుకొచ్చి పెట్టారు. కార్తీ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయేలా చేశారు.

 

చేయని తప్పుకు సారీ చెప్పి కార్తీ తన వ్యక్తిత్వాన్ని చూపించి.. తెలుగు ప్రేక్షకుల మనసులను కదిలించాడు. ఇక సినిమా కూడా ఎంతో ఆహ్లాదంగా ఉండడంతో సత్యం సుందరం సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. మంచి పాజిటివ్ టాక్ తో పాటు మంచి కలక్షన్స్ ను కూడా అందుకుంటూ దూసుకుపోతుంది. దీంతో తాజాగా సత్యం సుందరం చిత్రబృందం.. సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. తమ సినిమాను ఇంతగా సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.

 

ఇక ఈ సక్సెస్ మీట్ ఈవెంట్ లో కార్తీకి ఒక ప్రశ్న ఎదురయ్యింది. మహేష్ బాబుతో మీ సినిమా ఎప్పుడు.. ? అని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా.. కార్తీ మాట్లాడుతూ.. ” మంచి స్క్రిప్ట్ దొరికితే కచ్చితంగా చేస్తా .. మేము ఇద్దరం క్లాస్ మేట్స్.. స్కూల్ చదివేటప్పుడు ఇద్దరం ఒకే క్లాస్” అని చెప్పుకొచ్చాడు. గుంటూరు కారం తరువాత మహేష్ బాబు నటిస్తున్న చిత్రం SSMB 29. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది. ఈ సినిమాకు ఒకపక్క జక్కన స్క్రిప్ట్ వర్క్ చేస్తుండగా.. ఇంకోపక్క మహేష్.. మేకోవర్ మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే మహేష్ లుక్ పూర్తిగా మార్చేశాడు.

 

ఇక ఈ సినిమా అనౌన్స్ అయ్యిన దగ్గరనుంచి ఇందులో ఆ స్టార్ హీరో నటిస్తున్నాడు.. ఈ స్టార్ హీరో విలన్ గా నటిస్తున్నాడు అని పుకార్లు షికార్లు చేస్తూనే వస్తున్నాయి. ఆ మధ్య SSMB 29 లో కార్తీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు అని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇక ఇప్పుడు ఆ పుకార్లకు కార్తీ ఈ విధంగా సమాధానమిచ్చాడు. దీంతో మహేష్ సినిమాలో కార్తీ లేనట్టే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కార్తీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

ఇక ఈ సినిమా కాకుండా ఈ కుర్ర హీరో నటిస్తున్న చిత్రం ఖైదీ 2. సూర్య నటిస్తున్న కంగువలో కూడా కార్తీ కనిపించనున్నాడు. అన్నదమ్ముల మధ్య యుద్ధం.. చూడడానికి ఊరంతా సిద్ధం అని ఎప్పటినుంచో కంగువ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రంలో ఈ అన్నదమ్ములు.. ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *