తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు. డిజిటల్ హెల్త్ కార్డుల విషయమై ఆయన మాట్లాడారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులిస్తామన్నారు. అది కూడా మరో 30 రోజుల్లోనే ఈ కార్డులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం విషయంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది. వాటికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు సర్కారు కృషి చేస్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరికీ విడివిడిగా హెల్త్ ప్రొఫైల్ రూపొందించనున్నాం. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ ను డిజిటలైజ్ చేయనున్నాం. ఆ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలను కూడా పొందుపరుస్తాం. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో దుర్గాబాయి దేశ్ ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా భాగం కావాలని కోరుతున్నాను’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.