వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే..?

ఏపీలో ఇటీవలే భారీగా వర్షాలు, వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అయితే, తాజాగా మరో విషయాన్ని వెల్లడించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(ఎస్డీఆర్ఎఫ్) నిర్దేశించిన మొత్తం కంటే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్డీఆర్ఎఫ్ నిర్దేశించిన మొత్తం కంటే అదనంగా ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను మార్చుతూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా వరద ముంపు బాధితులకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

 

మొత్తం 179 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు ఎస్డీఆర్ఎఫ్ నిర్దేశించిన రూ. 11 వేలకు బదులుగా రూ. 25 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. మొదటి అంతస్తులో ఉన్న ముంపు బాధితులకు రూ. 10 వేలు, వరదలకు ధ్వంసమైన దుకాణాలకు రూ. 25 వేలు, వ్యవసాయ పంటలకు హెక్టారుకు రూ. 25 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనున్నది. అదేవిధంగా వరదలు, వర్షాల కారణంగా ఇళ్లు ధ్వంసమైన వారికి కూడా గృహ నిర్మాణ పథకాల కింద ఇంటిని నిర్మించి ఇస్తామంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *