తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి, ఇతర ముడిపదార్థాల వాడకంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని జగన్ లేఖలో కోరారు.
తన రాజకీయాల కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేశారని లేఖలో పేర్కొన్నారు. టీటీడీ చేసిన పనుల వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాపోయారు. ఎంతో సున్నితమైన విషయాన్ని చంద్రబాబు తన రాజకీయ అవసరాలకు వాడుకున్నారని, సీఎం పదవికే మచ్చతెచ్చేలా ప్రవర్తించారని లేఖలో రాశారు. అంతేకాకుండా టీటీడీ సంప్రదాయాలపైనే అందరికీ అనుమానాలొచ్చేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ లేఖలో డిమాండ్ చేశారు.
గతంలోనూ జగన్ ప్రధానికి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో.. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, వేధింపులు భరించలేక ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, ఆస్తుల ధ్వంసం పెరిగిందని, ఇంకా రాష్ట్రంలో ఏమేం జరుగుతున్నాయో చెప్పేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలంటూ జులైలో ప్రధానికి లేఖ రాశారు జగన్.
కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం బీజేవైఎం నేతలు జగన్ ఇంటి ఎదుట నిరసన చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి తాడేపల్లి పీఎస్ కు తరలించారు.