ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక విషయమై ఈ భేటీలో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జగన్ కు విశ్వసనీయత లేదు. త్యాగాలు చేసినవారిని జగన్ విస్మరించారు. జగన్ ఏరోజూ కూడా బహిరంగ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీ వీడినా. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పవన్ నా గురించి మాట్లాడారు. జగన్ ఓడిపోయినా తన పద్ధతిని మార్చుకోలేదు.
జగన్ ను నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నా. నాతోపాటు వచ్చే నాయకులను జనసేనలోకి తీసుకెళ్తా. వైసీపీలో నాకు ప్రాధాన్యత తగ్గింది. పార్టీ తీరు నచ్చకనే రాజీనామా చేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రేమతో ఇన్నాళ్లు జగన్ వెంట ఉన్నా.
నాపై పవన్ కల్యాణ్ ఎంతో అభిమానంతో ఉన్నారు. పవన్ తో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం. ఏనాడూ నేను అధికారం కావాలనుకోలేదు. మంత్రి పదవిని కూడా వదులుకున్నాను. భేటీలో పవన్ ముందు నేను ఏ డిమాండ్ పెట్టలేదు. నాకు పదవులు ముఖ్యం కాదు.. గౌరవం కావాలి. కూటమి పార్టీల నేతలతో కలిసి నడిచేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మంచి రోజు చూసుకుని జనసేన పార్టీలో చేరుతా. జనసేనలో చేరేందుకు ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు.