మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కోర్టులో వాదనలు జరిగాయి. జోగి రాజీవ్ తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు వినిపించారు. తమ క్లయింట్ జోగి రాజీవ్ను కావాలనే కేసులో ఇరికించారని వాదించారు. ఆధారాలు లేకుండా తప్పుడు కేసుల్లో ఇరికించారని చెప్పారు.
కాగా, నిషేధిత అగ్రిగోల్డ్ భూమిని కొనుగోలు చేయడమే కాకుండా సర్వే నెంబర్ను మార్పించారని పీపీ వాదించారు. అయితే.. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలతో ఏసీబీ అధికారులు ఖంగుతిన్నారు. అసలు ఇది ఏ విధంగా కుట్ర కోణం అవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే సర్వే చేయడమే కుట్రకోణమని పీపీ వాదించారు.
దీంతో న్యాయమూర్తి మరిన్ని ప్రశ్నలు సంధించారు. ఏ1 జోగి రాజీవ్, ఏ3 సర్వేయర్ రమేష్లను అరెస్టు చేశారని గుర్తు చేస్తూ.. కానీ, ఏ2 జోగి వెంకటేశ్వరరావు, ఏ4 గ్రామ సర్వేయర్ దేదీప్య, ఏ5 సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులను ఎందుకు అరెస్టు చేయలని అడిగారు. ఆ సమయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తహశీల్దార్ అధికారిని ఎందుకు అరెస్టు చేయలదని కూడా ప్రశ్నించారు. ఆ తహశీల్దార్ పరారీలో ఉన్నాడా? అని అడిగారు. కొనుగోలు చేసిన భూమి అటాచ్మెంట్లో ఉందా? ఉంటే దాని ఆధారాలు చూపాలని సూచించారు. ఆ భూమి అటాచ్మెంట్లో ఉన్నట్టు జీవో చూపించాలని అడగటంతో ఏసీబీ అధికారులు ఖంగుతిన్నారు. దీంతో అటాచ్మెంట్ జీవో కాపీ కోసం సమయం కావాలని ఏసీబీ అధికారులు అడిగారు.