అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు పోతుంటే తాడేపల్లి నివాసంలో సీఎం జగన్ ఐపీఎల్ మ్యాచ్లు మిస్ అవ్వకుండా చూస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతి చెందడం పట్ల ఆయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను రోజూ వివరిస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదని విమర్శించారు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందులు అందక ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకి వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. తక్షణమే బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత లేకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.