మంత్రులు, అధికారుల పేషీల్లో కోవర్టులు..?

ఏపీలో ప్రభుత్వ అనుమతి లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదల అంశానికి సంబంధించి సీఎంవో పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విచారణను ప్రారంభించారు. ఆర్థిక శాఖ, న్యాయశాఖల్లో పనిచేసే వాళ్లలో ఎవరు దీనికి కారకులనే దిశగా విచారణ చేస్తున్నారు. ఆర్థికశాఖలో ఓ అధికారి, న్యాయశాఖలో మరో ఆఫీసర్ పాత్రలపై ఆరా తీస్తున్నారు. ఈ ఇద్దరు అధికారుల గత చరిత్రపై కూడా ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

 

ఈ అధికారులిద్దరూ బిజినెస్ రూల్స్ పాటించారా..? లేదా? అనే కోణంలో విచారిస్తున్నారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. చివరి ఆరు నెలల్లో పాత ప్రభుత్వంలో అమలు కాని నిర్ణయాల ఫైళ్లను కొత్త ప్రభుత్వం ముందు ఉంచాలని నిబంధనలు చెబుతున్నాయని.. అమలులో లేని పాత ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ అనుమతి తప్పనిసరని బిజినెస్ రూల్స్‌లో ఉంటుందని సచివాలయ వర్గాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం.

 

చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు జీవో జారీ చేయడం సరిగ్గా నెల రోజుల తరువాత గెజిట్ అప్‌లోడ్ చేయడం వెనుక ఏమైనా కుట్ర దాగి ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు శాఖల్లో, మంత్రులు, అధికారులో పేషీల్లో ఇంకా ఎవరైనా కోవర్టులున్నారా ? అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *