లోక్ సభ ప్రతిపక్ష నేతగా ఏఐసీసీ అగ్రనేత రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం నియమితులయ్యారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్కు లేఖ రాశారని ఆ పార్జీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా నియమిస్తూ జూన్ 9న తీర్మానాన్ని ఆమోదించింది. కాగా సీడ్య్లూసీ సమావేశం తర్వాత రాహుల్ గాంధీ ఈ విషయమై నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం కావాలని తెలిపారు.
కాగా ఈ సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీని ప్రధాన ప్రతిపక్ష నేతగా నియమిస్తున్నట్లు తెలిపారు.
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశంలో రాహుల్ గాంధీని లోక్సభ ప్రతిపక్షనేతగా నియమిస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ(ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ నేత హమునన్ బెనివాల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. ఆ పార్టీ ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాలను గెలుచుకుందని.. అందులో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారని శివసేన(యూబీటీ) నేత ఆనంద్ దూబే అన్నారు.
గాంధీ కుటుంబంలో లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తి రాహుల్ గాంధీ. అతని కంటే ముందు, అతని తల్లిదండ్రులు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఈ పదవులను నిర్వహించారు.
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానలను గెలుచుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 44 సీట్లను మాత్రమే గెలుచుకోగా.. 2019లో ఆ పార్టీ 52 స్థానాలను గెలుచుకుంది. అయితే రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో రెండవ అతిపెద్ద పార్టీ హోదా దక్కించుకున్నప్పటికీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవి ప్రమాణాలకు కాంగ్రెస్ దూరమైంది. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే 10 శాతం సీట్లు తప్పక గెలవాల్సిందే.
కాగా ఈ ఉదయం రాహుల్ గాంధీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ ఎంపీగా ప్రమాణం చేయడం విశేషం. ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో రాహుల్ గాంధీ జై హింద్, జై సంవిధాన్ అంటూ నినాదాలు చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, ఉత్తర్ప్రదేశ్ లోని రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసి రెండింట్లో ఘనవిజయం సాధించారు. అయితే తాను వయనాడ్ స్థానాన్ని వదులుకుంటున్నట్లు తెలిపారు. ఇక వయనాడ్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తన సోదరి ప్రియాంక గాంధీ బరిలో నిల్చోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.