తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం..

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టగానే సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

 

రాధాకృష్ణన్ ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై రాజీనామా చేశారు. ఈ క్రమంలో సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలను కేంద్రం అప్పగించింది.

 

రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వారు. ఆయన 1957 మే 4న జన్మించారు. బీజేపీలో కీలకంగా పనిచేశారు. తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. కోయంబత్తూరు నుంచి ఎంపీగా రెండుసార్లు విజయం సాధించారు. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రంలో ఆయనకు కీలక పదవి దక్కింది. 2016-19 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డు ఛైర్మన్ పనిచేశారు.

 

2023 ఫిబ్రవరి 18న ఝార్ఖండ్ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. ఏడాదికిపైగా ఆ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్ బాధ్యతలను ఆయనకు కేంద్రం అప్పగించింది. అలాగే పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. తెలంగాణ, పాండిచ్చేరికి కొత్త గవర్నర్లను నియమించే వరకు సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వహించనున్నారు.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ముగ్గురు గవర్నలు వచ్చారు. తొలి గవర్నర్ గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ , ఆ తర్వాత గవర్నర్ గా పనిచేసి తమిళిసై , ఇప్పుడు సీపీ రాధాకృష్ణన్ ముగ్గురు తమిళనాడుకు చెందినవారే కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *