ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పలు దఫాలుగా చర్చలు జరిపినా వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, దీంతో కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం, రెండు వేతన సవరణల అమలు, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘ ఎన్నికల నిర్వహణ, కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రయాణీకుల సౌకర్యం కోసం కొత్త బస్సులు కొనుగోలు చేసి సంస్థను విస్తరిస్తామన్నారన్నారు.
ఎలక్ట్రిక్ బస్సులు..
కానీ అలాంటి హామీలు ఏవీ అమలుకాకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ఆర్టీసీలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో అద్దె వాహనాలను తీసుకొస్తున్నారని, ఈ బస్సులో పనిచేస్తున్న డ్రైవర్స్ ఆర్టీసీకి సంబంధం లేదన్నారు. ఈ బస్సుల మీద ప్రభుత్వ ఇస్తున్న సబ్సిడీ ప్రైవేట్ వ్యక్తులకే చెందుతున్నాయన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వం తీసుకొని ఆర్టీసీకి ఇవ్వడం వలన ఆదాయం కూడా సంస్థకు చెందుతున్నదని, ప్రైవేట్ గుత్తాధిపత్యం కూడా తగ్గుతుందన్నారు.
ఆవేదన వ్యక్తం..
గత 11 ఏళ్లుగా ఆర్టీసీలో నియామకాలు లేకపోవడం వలన పని భారాన్ని ఉన్న ఉద్యోగులే భరించాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్మికులు తీవ్ర అనారోగ్యాలకు గురైతున్నారని, అంతేగాకుండా పీఎఫ్కు సంబంధించి ఉద్యోగస్థుల నుంచి రికవరి చేసిన సుమారు 1200 కోట్ల రూపాయలను యాజమాన్యం రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్కు పంపకపోవడం వలన చాలా మంది ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్లు గత 5 ఏళ్లుగా విడుదల కాలేదన్నారు.
సమ్మెకు వెళ్ళకుండా చర్చలు
కార్మికులు అనేక సమస్యలు సమ్మె నోటీసులో యాజమాన్యానికి ఇచ్చారని, లేబర్ కమిషన్ తో జరిగిన సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం రాకపోవడంతో తిరిగి 13వ తేదీకి సమావేశాన్ని వాయిదా వేశారన్నారు. ఈ సమావేశంలో సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులు సమ్మెకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళకుండా చర్చలు జరిపి వారి డిమాండ్ల సాధనకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.