తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్లోని టీజీబీఐఈ కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను వెల్లడిస్తారు. ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావుతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని రిజల్ట్స్ విడుదల చేస్తారు.
ఈ ఏడాది జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన నాటి నుండి ఫలితాల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను వేగంగా పూర్తి చేసిన బోర్డు సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.tgbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. వెబ్సైట్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే బోర్డు హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించే అవకాశం కల్పించారు. ఉన్నత విద్యా ప్రవేశాలకు ఈ మార్కులు అత్యంత కీలకం కావడంతో విద్యార్థుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.