అసత్యాలు ప్రచారం చేయడం తమ జీవిత ధ్యేయం అన్నట్లుగా వైసీనీ నాయకులు ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి తమ ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారని ఆయన వివరించారు. సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణుల తీరును మంత్రి లోకేష్ క్లియర్ కట్ గా వివరించారు.
2018 సంవత్సరంలో అమరావతి బాండ్స్ విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం అది. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన మాట్లాడిన అంశాలను ముందు భాగం కట్ చేశారు. అమరావతి రాజధానికి అవసరమైన నిధుల గురించి చెబుతున్నట్లుగా ఒక ఫేక్ వీడియోను సృష్టించారు. దీనిని వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.
భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 2.5 ట్రిలియన్ డాలర్ల పరిమాణంలో ఉందని ఆనాడు సీఎం పేర్కొన్నారు. దేశంలో సుమారు 30 శాతం సేవింగ్స్ ఉంటాయని వివరించారు. అంటే ప్రతి సంవత్సరం సుమారు 750 బిలియన్ డాలర్ల సేవింగ్స్ సాధ్యమవుతాయని గణాంకాలతో సహా చెప్పారు. భారత్ ప్రస్తుతం 10 నుంచి 12 శాతం వృద్ధి సాధించే సామర్థ్యం కలిగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సరైన ప్రణాళికలు అమలు చేస్తే 15 శాతం వరకు వృద్ధి సాధ్యమవుతుందని ఆనాడే విజన్ ప్రకటించారు. ఈ విధంగా వృద్ధి కొనసాగితే పదేళ్లలో సుమారు 10 ట్రిలియన్ డాలర్ల సేవింగ్స్ సమీకరించవచ్చని ఆయన అంచనా వేశారు. దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని స్పష్టం చేశారు.
ఈ ప్రసంగంలోని కీలక వ్యాఖ్యలను వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంది. ‘2 నుంచి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం’ అన్న వ్యాఖ్యలకు ముందున్న వివరణ అంతా తొలగించింది. అక్కడ ‘అమరావతికి’ అనే పదాన్ని అతికించి ఓ ఫేక్ వీడియోను రూపొందించింది. ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రవేశపెట్టడం వల్ల అమరావతి భారం అవుతుందనే కుట్రపూరిత వ్యాఖ్యలను జత చేసింది. భూముల ధరలు భారీగా పెరగడం వంటి పరిణామాలతో ప్రాజెక్ట్ ఆర్థిక భారం అవుతుందనే విష ప్రచారాన్ని సోషల్ మీడియాలో వదిలింది.
అమరావతి రాజధాని నిర్మాణంపై మొదటి నుంచీ వైసీపీ వ్యతిరేకత ప్రదర్శిస్తోంది. అమరావతికి ప్రత్యామ్నాయంగా ‘మావిగన్’ అనే వికృత ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. తప్పుడు వీడియోలతో ఫేక్ ప్రచారం చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజల మధ్య గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ ఐటీ వింగ్ పనిచేస్తోంది. వాస్తవాలను వక్రీకరించి పైశాచిక ఆనందం పొందడం ఈ నాయకులకు అలవాటుగా మారింది. అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ఇలాంటి నీచమైన రాజకీయాలకు పాల్పడటం శోచనీయం.
టెక్నాలజీని వాడుకుని మనుషుల మాటలను మార్చడం క్షమించరాని నేరం. గతంలో దేశం గురించి మాట్లాడిన మాటలను నేడు అమరావతికి ముడిపెట్టడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. వాస్తవాలను గ్రహించి వైసీపీ చేస్తున్న కుటిల యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజధానిపై విషం చిమ్మే ఏ ఒక్క ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా ప్రజలు గమనిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఫేక్ ప్రచారాలకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ రాసుకొచ్చారు.