మావిగన్‌కు రాష్ట్రంలో భారీ స్పందన..! బొత్స సంచలన వ్యాఖ్యలు..

విశాఖపట్నం వేదికగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు విడదీయరాని అనుబంధం ఉందని బొత్స స్పష్టం చేశారు. కేవలం రాజకీయ పదవుల కోసం నీచమైన రాజకీయాలకు పాల్పడవద్దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ధ్వజం

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన సంతకాల వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని బొత్స తేల్చి చెప్పారు. ఈ వాస్తవం అప్పట్లో ఉన్న రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలకు కూడా తెలుసన్నారు. అచ్చెన్నాయుడు కేవలం తన పదవిని కాపాడుకోవడానికే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దివంగత నేత వైఎస్ఆర్ గురించి అనుచితంగా మాట్లాడటం వల్లే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని వివరించారు.

 

వైఎస్సార్‌ను తలుచుకుని కన్నీరు పెట్టుకున్న బొత్స..

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో జగన్ అక్కడే ఉన్నారని బొత్స గుర్తు చేశారు. వైఎస్సార్ ను గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా బొత్స భావోద్వేగానికి గురయ్యారు. ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో తాను, తన భార్య కలిసి క్యాంప్ ఆఫీస్ నుండి జగన్‌ను తీసుకువచ్చామని పేర్కొన్నారు. రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోవాలి కానీ చనిపోయిన వ్యక్తిని వివాదాల్లోకి లాగడం సంస్కారం అనిపించుకోదని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు సభ్యత, సంస్కారం లేని వ్యక్తిగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకరి చరిత్ర మరొకరికి బాగా తెలుసని, అనవసరంగా వ్యక్తిగత విమర్శలకు దిగవద్దని సూచించారు.

 

డైవర్షన్ పాలిటిక్స్ పై విమర్శ

 

ప్రస్తుతం సాగుతున్న ‘మావిగన్’ కార్యక్రమానికి వస్తున్న అపూర్వ స్పందన చూసి ఓర్వలేకనే ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని బొత్స ఆరోపించారు. మావిగన్ గురించి మాట్లాడమంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇంట్లో ఉండే ఆడవాళ్ల గురించి కూడా చులకనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను వ్యక్తిగతంగా ఎన్ని మాటలన్నా బాధపడనని, కానీ కుటుంబ సభ్యులను లాగడం సరికాదని హితవు పలికారు.

 

దమ్ముంటే న్యాయం చేయండి

 

ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి న్యాయం చేయాలని బొత్స సవాల్ విసిరారు. అబద్ధపు ప్రచారాలతో కాలక్షేపం చేయకుండా పాలనపై దృష్టి పెట్టాలని కోరారు. తమపై చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *