వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంబరాలు ఇప్పుడు పెను వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సంచలన నివేదిక సమర్పించింది. సుమారు 3 వేల పేజీలతో కూడిన ఈ నివేదిక ఇప్పుడు మాజీ మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ (SAP) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిల మెడకు చుట్టుకుంటోంది. ప్రభుత్వం వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఈ కుంభకోణంలో క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 600కు పైగా ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు లోతైన విచారణ జరిపారు. తొలుత ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 40 కోట్ల రూపాయలుగా ఉన్నప్పటికీ.. క్రమంగా దానిని 125 కోట్ల రూపాయల వరకు పెంచేయడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఇందులో కనీసం 40 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. క్రీడాకారులకు పంపిణీ చేసిన కిట్లు, మైదానాల నిర్వహణ, ప్రచార కార్యక్రమాల పేరిట పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయని అధికారులు నిర్ధారించారు.
విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన మొదలుకొని.. నాసిరకం పరికరాల సరఫరా వరకు అన్నీ అక్రమాలమయమని తేలింది. ఈ నేపథ్యంలోనే బాధ్యులైన ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం సిఫారసు చేసింది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి విచారణను అవినీతి నిరోధక శాఖ (ACB) లేదా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID)కి అప్పగించే దిశగా ఏపీ ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది.
మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ఏమన్నారంటే..?
ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో పేద క్రీడాకారుల పొట్టకొట్టారని ఆయన మండిపడ్డారు. క్రీడలను ప్రోత్సహించాల్సిన వారే నిధుల వేటలో పడి క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్మును అడ్డగోలుగా వెచ్చించి వ్యక్తిగత లబ్ధి పొందిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెడతామని ప్రభుత్వం ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పట్లో ఈ కార్యక్రమం నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన అధికారుల పాత్రపై కూడా విచారణ ముమ్మరం చేశారు. క్రీడా కిట్ల కొనుగోలులో భారీగా కమీషన్లు చేతులు మారినట్లు వస్తున్న ఆరోపణలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. బాధితులుగా ఉన్న క్రీడాకారుల నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కుంభకోణం మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.