భారతీయ చలనచిత్ర రంగంలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ ఒకటి. ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, ‘జవాన్’తో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన అట్లీతో చేతులు కలపడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను అల్లు అర్జున్ పుట్టన రోజు సందర్భంగా ఏప్రిల్ 8 తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అప్డేట్ రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
నేపథ్యం
అట్లీ సాధారణంగా కమర్షియల్ ఎంటర్టైనర్లకు పేరుగాంచినప్పటికీ, ఈసారి అల్లు అర్జున్ కోసం ఒక సరికొత్త సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని, అందులో ఒక పాత్ర అత్యంత స్టైలిష్గా, మరొకటి రఫ్ అండ్ టఫ్ లుక్లో ఉంటుందని సమాచారం.
రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్
సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవలం యాక్షన్ సీక్వెన్స్ల కోసమే వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ను కళ్లు చెదిరే ధరకు దక్కించుకోవడం విశేషం.
తారాగణం
ఈ సినిమాలో నటించబోయే నటీనటుల జాబితా కూడా పాన్ ఇండియా రేంజ్లో ఉంది. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనే ప్రధాన పాత్రలో కనిపించనుండగా, మరో కీలక పాత్ర కోసం రష్మిక మందన్న పేరు వినిపిస్తోంది. తన విలక్షణమైన మ్యూజిక్తో ఆకట్టుకుంటున్న సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరోసారి బన్నీతో తలపడనున్నట్లు సమాచారం. అయితే రేపు విడుదల చేసే అప్డేట్ లో పూర్తి వివరాలు తెలుస్తాయి. అట్లీ, అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టైటిల్ ఏంటో తెలియాలి అంటే రేపటి వరకూ ఆగాల్సిందే.