తమిళ గడ్డపై తెలంగాణ మార్క్.. స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం రేవంత్.. మంత్రులు భట్టి, ఉత్తమ్..

దక్షిణాది రాజకీయాల్లో కీలకమైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు చెందిన కీలక నాయకులు అక్కడ తమ హవా చాటేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తమిళనాడు ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ నుంచి ముగ్గురు అత్యంత కీలకమైన నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఈ నాయకులు ఇప్పుడు తమిళనాట విజయభేరి మోగించడానికి తమ వంతు కృషి చేయనున్నారు.

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూకుడుగా ప్రసంగిస్తూ జనాలను ఆకట్టుకోవడంలో దిట్ట. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రచార సరళి.. మాట తీరు పార్టీకి భారీ మైలేజీని తెచ్చిపెట్టాయి. అదే జోరును ఇప్పుడు తమిళనాడులోనూ కొనసాగించాలని హైకమాండ్ భావిస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ఆయన భారీ బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి రాకతో అక్కడ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందని నాయకత్వం ఆశిస్తోంది.

 

మరోవైపు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనదైన రాజకీయ వ్యూహాలతో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. సామాజిక సమీకరణాలు.. క్షేత్రస్థాయి రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న భట్టి.. దళిత.. బహుజన ఓటు బ్యాంకును ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషించనున్నారు. తెలంగాణలో ఆయన నిర్వహించిన పాదయాత్ర ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే అనుభవంతో తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.

 

ఈ ముగ్గురు నేతల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం మరింత కీలక బాధ్యతలను అప్పగించింది. తమిళనాడులోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయనను ఇంచార్జ్‌గా నియమించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి గతంలో జాతీయ స్థాయిలో పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు ఇతర రాష్ట్రాల రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది. ఆయన పర్యవేక్షణలో ఈ 12 నియోజకవర్గాల్లో పార్టీ వ్యూహాలను అమలు చేయనున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి క్షేత్రస్థాయి ప్రచారం వరకు ప్రతి అడుగును ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తారు.

 

తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, సుపరిపాలనను తమిళనాడు ప్రజలకు వివరించడమే ఈ నేతల ప్రధాన ఉద్దేశం. పొరుగు రాష్ట్రాల మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా తెలంగాణ నాయకుల మాటలకు అక్కడ ప్రాధాన్యత ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు కాంగ్రెస్-డీఎంకే కూటమికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. రానున్న రోజుల్లో రేవంత్, భట్టి, ఉత్తమ్ పర్యటనలతో తమిళనాట రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *