బాసర క్షేత్రానికి నూతన వైభవం.. రూ. 225 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం..!

దక్షిణ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన, ఏకైక జ్ఞాన సరస్వతి క్షేత్రం బాసర పునర్నిర్మాణంతో నూతన శోభను సంతరించుకోబోతోంది. వేల ఏళ్ల నాటి ఘన చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 225 కోట్లను కేటాయించింది. ఈ చారిత్రాత్మక పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం, ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ క్షేత్రాన్ని సకల సదుపాయాలతో తీర్చిదిద్దనున్నారు.

 

ఆలయ పునర్నిర్మాణం కోసం అధికారులు శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించి, వారి అనుమతులు, సూచనల మేరకు మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజగోపురం, మాడ వీధులు, కోనేరు నిర్మాణాలలో ఆగమ శాస్త్ర నియమాలను పాటించనున్నారు.

 

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ విస్తీర్ణాన్ని భారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు విస్తరిస్తున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల భారీ రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలను నిర్మించనున్నారు. ఆలయం చుట్టూ 33 అడుగుల వెడల్పుతో విశాలమైన మాడ వీధులు ఏర్పాటు కానున్నాయి. మొత్తం ఆలయ విస్తీర్ణం 20 వేల నుండి 62 వేల చదరపు అడుగులకు పెరగనుంది. ఒకేసారి 6 వేల మంది భక్తులు వేచి ఉండేలా 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యూ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో ఫీడింగ్ రూమ్స్, ఫుడ్ స్టాల్స్, మరుగుదొడ్లు వంటి వసతులు ఉంటాయి.

 

కురుక్షేత్ర యుద్ధం తర్వాత మనశ్శాంతి కోసం వేద వ్యాస మహర్షి పవిత్ర గోదావరి తీరానికి చేరుకుని బాసరలో నివసించారు. స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్ల మూర్తులను ఇక్కడ ప్రతిష్టించారని స్థల పురాణం చెబుతోంది. అందుకే బాసర ముగ్గురమ్మల కొలువైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ఈ క్షేత్రం దేశవ్యాప్తంగా పెట్టింది పేరు. వసంత పంచమి వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీని తట్టుకునేలా ఇప్పుడు ఆలయ విస్తరణ పనులు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *