వైసీపీ రూటు మార్చిందా? ప్రభుత్వంపై ఆందోళనకు శ్రీకారం చుడుతోందా? శనివారం ఏపీ వ్యాప్తంగా వైసీపీ చేసిన నిరసనలు పార్టీకి మైలేజీ ఏమైనా పెంచిందా? టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారాన్ని ఎందుకు ఎంపిక చేసుకుంది? ఎక్కడైతే పార్టీ వ్యవహారం డ్యామేజ్ అయ్యిందో మళ్లీ అక్కడే గెయిన్ కావాలని డిసైడ్ అయ్యిందా? అందుకే నాయుడు వ్యవహారాన్ని ఎత్తుకుందా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.
రూటు మార్చిన వైసీపీ.. ఇకపై ఆందోళనల పర్వం మొదలైందా?
ఏపీలో వైసీపీ పరిస్థితి ఏంటి? అధికారం కోల్పోయి దాదాపు రెండేళ్లు గడిచినా ఇంకా పుంజుకోవడం లేదా? ప్రతీవారం అధినేత బెంగుళూరు వెళ్లిపోయవడం, నేతలు-కేడర్కు అందుబాటులోకి రావడం లేదని కొందరు అంటున్నారు. కొన్ని అంశాలపై ఆందోళనలు చేపట్టాలని ఆ పార్టీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారాన్ని ఎత్తుకుంది.
ఇటీవల టీటీడీ ఛైర్మన్కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై వైసీపీ నుంచి ఎదురుదాడి మొదలు కావడంతో స్వయంగా బీఆర్ నాయుడు రంగంలోకి దిగారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. మీడియా సమావేశం పెట్టి వివరణ కూడా ఇచ్చారు. ఈ ఎపిసోడ్ జరిగి చాన్నాళ్లు అయ్యింది. నిన్న అనగా శనివారం ఇదే అంశాన్ని వైసీపీ లేవనెత్తింది.
వైసీపీ నేతల ఆందోళనలు, దాన్ని డైవర్ట్ చేయడానికేనా?
టీటీడీ ఛైర్మన్ రాజీనామా చేయాలంటూ ప్రతీ నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు నిరసనలకు దిగారు. ముగిపోయిన ఎపిసోడ్ను మళ్లీ లేవనెత్తడం వెనుక అసలు కారణమేంటంటూ ఏపీలో రాజకీయ నేతలు చర్చించుకోవడం మొదలైంది. ఈ నేపథ్యంలో మరో విషయం బయటకు వచ్చింది. ‘మావిగన్’ ఎపిసోడ్లో వైసీపీ ఇంటా బయటా విమర్శలు పాలైంది. చివరకు వైసీపీ సోషల్ మీడియా విశ్లేషకులు సైతం అధినేత వ్యాఖ్యలను తప్పబట్టారు.
కేవలం మాజీ మంత్రులు జగన్కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశారు. మావిగన్ ఎపిసోడ్ను అధికార పార్టీ తీవ్రతరం చేసింది. దీన్ని డైవర్ట్ చేసేందుకు బీఆర్ నాయుడు ఎపిసోడ్ను ఎంపిక చేసుకున్నట్లు కొందరు నేతలు ఆఫ్ ఆ రికార్డులో చెబుతున్నారు. అమరావతికి చట్టబద్దత విషయంలో వైసీపీ తీవ్ర అభాసుపాలైంది. వైసీపీ తప్పా, దేశంలోని అన్ని పార్టీలు రాజధాని అమరావతి బిల్లుకు మద్దతు పలికాయి.
జాతీయ స్థాయిలో జగన్ గురించి రకరకాలుగా నేతలు మాట్లాడుకోవడం కనిపించింది. దీన్ని డైవర్ట్ చేసేందుకు ఈ స్కెట్ వేసినట్టు కొందరి మాట. ఎందుకంటే అమరావతి విషయంలో జగన్ పలుమార్లు మాట తప్పారు. తొలుత రాజధాని అమరావతికి వేలాది ఎకరాలు కావాలన్నారు. చంద్రబాబు సర్కార్ సేకరించిన అన్ని అనుమతులు తెచ్చిన తర్వాత నిర్మాణాలు మొదలయ్యాయి. ఈలోగా టీడీపీ ప్రభుత్వం దిగిపోయింది.
ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. ఈ విషయంలో టీడీపీ తీసుకున్న స్టాండ్ పై నిలబడిపోయింది. మరో అడుగు ముందుకేసి అమరావతికి చట్టబద్దత కల్పించింది. ఈ ఎపిసోడ్లో వైసీపీ ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంది. మావిగన్ అంటూ రాజధాని చుట్టూ ప్రాంతాలను ఆకట్టుకునే ప్రకటన చేశారు వైసీపీ అధినేత.
జగన్ చెప్పిన మాదిరిగా రాజధాని అమరావతి.. ఉమ్మడి గుంటూరు, కృష్ణాల మధ్యనే ఉంది. మావిగన్ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టాలనే టీటీడీ ఛైర్మన్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు. మొత్తానికి అమరావతి విషయంలో జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు.