తేది: 02-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతోత్సవాలు కన్నులపండవగా జరుగుతున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా లక్షలాదిమంది దీక్షాపరులు కాలినడకన అంజన్న దర్శనానికై తరలివస్తున్నారు. దీంతో కొండగట్టుకు వెళ్లే ఏ దారి చూసినా కాషాయవర్ణమే దర్శనమిస్తోంది. చిన్నపెద్ద అనే తారతామ్యం లేకుండా కొండగట్టుకు చేరుకునే దారులన్నింటికీ కాషాయ రంగు పులుముకుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా వచ్చిన దీక్ష స్వాములతో, పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న కొండగట్టు ప్రాంతమంతా కాషాయ వర్ణం సంతరించుకుంది. ఇసుకేస్తే రాలనంత జనంతో కొండగట్టు పరిసర ప్రాంతాలన్ని భక్తజన సందర్భంగా మారాయి. రామనామ స్మరణతో కొండగట్టు పరిసరాలన్ని మార్మోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, కట్టుదిట్టమైన భద్రతల నడుమ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.