ప్రముఖ చిత్రకారుడు రాజా రవి వర్మ గీసిన ఓ పెయింటింగ్ కు అరుదైన రికార్డు దక్కింది. యశోద, చిన్ని కృష్ణుడు ఉన్న ఆయిల్ పెయింటింగ్ వేలంలో రూ.167.2 కోట్లకు అమ్ముడయ్యింది. ముంబైకి చెందిన సాఫ్రాన్ ఆర్ట్స్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన వేలంలో ‘యశోద, కృష్ణ’ అనే కళాఖండం ఏకంగా రూ.167.2 కోట్లు పలికింది. ఇప్పటి వరకు అమ్ముడైన ఆధునిక భారతీయ కళాఖండాలలో అత్యధిక విలువైనదిగా ఈ పెయింటింగ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. భారతీయ కళకు ఉన్న విలువను ఈ వేలం మరోసారి రుజువు చేసినందని చిత్రకారులు అంటున్నారు. గతేడాది ఎమ్.ఎఫ్ హుస్సేన్ గీసిన ఓ చిత్రం రూ.118 కోట్లకు అమ్ముడైంది.
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూనావాలా ఈ పెయింటింగ్ ను కొనుగోలు చేశారు. ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ జాతీయ సంపదను ఎప్పటికప్పుడు ప్రజల చూసేందుకు అందుబాటులో ఉంచుతానని చెప్పారు.
పోస్టర్ చిత్రకారుడని ఎగతాళి
1848లో కేరళ కిలిమానూరులో జన్మించిన రాజా రవి వర్మ, ఆయిల్ పెయింటింగ్ ద్వారా భారతీయ పౌరాణిక విషయాలను చిత్రించడంలో ప్రసిద్ధి చెందారు. శకుంతల, సీత, దమయంతి, ద్రౌపది వంటి స్త్రీ పాత్రలను తన చిత్రాల్లో ఎంతో అద్భుతంగా చూపించారు. ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన పూయం తిరునాల్ గౌరీ పార్వతీ బాయి మాట్లాడుతూ… సైరస్ పూనావాలా ఈ పెయింటింగ్ ను కొనుగోలు చేసి భారత్ లోనే ఈ చిత్రాన్ని ఉంచినందుకు తాను సంతోషంగా ఉన్నానన్నారు. తమ ముత్తాత రవి వర్మకు దక్కాల్సిన గుర్తింపు లభిస్తున్నందుకు తాను గర్వపడుతున్నానన్నారు. 20వ శతాబ్దంలో ఆయనను పోస్టర్ చిత్రకారుడిగా కొంత ఎగతాళి చేశారన్నారు. కానీ ఇప్పుడు, ఆయన కళా వారసత్వానికి, నైపుణ్యానికి తగిన గుర్తింపు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఆయన విమర్శకులను మెప్పించడానికి చిత్రాలు గీయలేదని, చీరను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో, అద్భుతమైన ఆభరణాలను పరిరక్షించడం కోసం ఆయన కృషి చేశారన్నారు.
ఎంఎఫ్ హుస్సేన్ చిత్రం రూ.118 కోట్లు
గతంలో ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ‘అన్టైటిల్డ్ (గ్రామ్ యాత్ర)’ రూ.118 కోట్లకు అమ్ముడుపోయింది. రవి వర్మ చిత్రాలు కళాద్భుతాలు అన్నారు. ఇది కేవలం మార్కెట్కు ఒక మైలురాయి మాత్రమే కాదు, భారతీయ కళకు, నిరంతర సాంస్కృతిక, భావోద్వేగానికి ప్రత్యేక గుర్తింపు అని సాఫ్రాన్ ఆర్ట్స్ అధ్యక్షురాలు మినాల్ వజీరానీ అన్నారు