భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా గురించి నెట్టింట ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్, రణబీర్ కపూర్ – యష్ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ చిత్రం కోసం ఇండియాకు రాబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హాలీవుడ్ ది గ్రేట్ దర్శకుడు ఇండియాలో జరుగుతున్న ‘రామాయణ’ టీజర్ లాంచ్ ఈవెంట్ కు రావడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతుంది.
క్రిస్టోఫర్ నోలన్ రాక..
ప్రస్తుత సమాచారం ప్రకారం, రేపు (ఏప్రిల్ 2) హనుమాన్ జయంతి సందర్భంగా ‘రామాయణ’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టీజర్ను చిత్ర బృందం విడుదల చేయనుంది. అయితే, నోలన్ స్వయంగా ఈ ఈవెంట్కు హాజరవుతారనే విషయంపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. నోలన్ ఈ చిత్రంలో భాగస్వామి అవుతున్నారని వస్తున్న వార్తల వెనుక కొన్ని కారణాలు కూడా లేకపోలేదు. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎడిటింగ్ విజువల్ ఎఫెక్ట్స్ పనులను నోలన్ పర్యవేక్షించబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెందిన ‘DNEG’ అనే ప్రముఖ VFX కంపెనీ గతంలో నోలన్ తీసిన ‘ఇంటర్ స్టెల్లార్’, ‘టెనెట్’ వంటి సినిమాలకు పనిచేసింది. ఆ సాన్నిహిత్యంతోనే నోలన్ను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకువచ్చినట్లు సమాచారం.
నోలన్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ హోయ్టే వాన్ హోయ్టెమా కూడా ఈ సినిమా టెక్నికల్ టీమ్లో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. దాదాపు రూ. 4000 కోట్లతో రెండు భాగాలుగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ‘రామాయణ’ పార్ట్-1 వచ్చే దీపావళి (నవంబర్ 8, 2026) సమయంలో విడుదలయ్యే అవకాశం ఉంది. రెండో భాగం కూడా వచ్చే ఏడిది దీపావళి రోజున విడుదల చేయనున్నారు. నిజంగా క్రిస్టోఫర్ నోలన్ ఈ ఈవెంట్కు వస్తే మాత్రం, అది భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా మరో మెట్టు ఎక్కించినట్లే అవుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.