విద్యుత్ ఛార్జీల పెంపు.. క్లారిటీ ఇచ్చిన టీజీఈఆర్సీ..!

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) 2026-27 సంవత్సరానికి సంబంధించి రిటైల్ సరఫరా టారిఫ్ ఉత్తర్వులను విడుదల చేసింది. సామాన్యులపై భారం మోపకూడదని నిర్ణయించింది. విద్యుత్ చార్జీల పెంపు ఉండదని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ విద్యుత్ సరఫరా ఛార్జీలలో ఎటువంటి మార్పు చేయలేదని ప్రకటించింది. ఇదిలా ఉండగా గృహ, వ్యవసాయ విద్యుత్ కు ప్రభుత్వం మొత్తం రూ.14,000 కోట్ల సబ్సిడీని ప్రకటించింది. ఇందులో వ్యవసాయ రంగానికి (ఎల్టీ-V) రూ.12,181.21 కోట్లు, గృహ వినియోగదారులకు(ఎల్టీ-I) రూ.1,818.79 కోట్లు కేటాయించారు.

 

టైమ్ ఆఫ్ డే చార్జీల్లో భాగంగా..

ఇదిలా ఉండగా విద్యుదాఘాతంతో మరణించిన సాధారణ వ్యక్తుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచారు. ఇది ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వస్తుంది. టైమ్ ఆఫ్ డే చార్జీల్లో భాగంగా పగటిపూట (ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు) ఒక యూనిట్‌కు రూ.0.50 ప్రోత్సాహకంగా లభించనుంది. కాగా పీక్ అవర్స్ చార్జీలు మాత్రం పెంచింది. ఉదయం 6-10, సాయంత్రం 6-10 గంటల సమయంలో టారిఫ్‌ను యూనిట్‌కు రూ.1.00 నుంచి రూ.1.50కి పెంచారు. అంటే 50 పైసలు పెంచుతూ ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది.

 

గతంలో అదనంగా వసూలు..

సోలార్ రూఫ్‌టాప్ వినియోగదారులకు ఈఆర్సీ నిర్ణయం ఊరటనిచ్చింది. నెట్ మీటరింగ్ సోలార్ వినియోగదారులకు టారిఫ్ స్లాబ్‌లను నికర వినియోగం ఆధారంగా లెక్కించాలని డిస్కంలను ఆదేశించింది. గతంలో అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని రాబోయే మూడు బిల్లింగ్ సైకిల్స్‌లో సర్దుబాటు చేయాలని స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల టారిఫ్ వర్తిస్తుందని పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ కంపెనీల మొత్తం ఆదాయ అవసరం రూ.64,950.72 కోట్లుగా మండలి ఖరారు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *