బీహార్‌లో విషాదం.. ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది భక్తులు మృతి..

ఆధ్యాత్మిక చింతనతో వెళ్లిన ఆ భక్తుల ఇళ్లలో ఒక్కసారిగా చీకట్లు ముసిరాయి. బీహార్‌లోని నలంద జిల్లా మఘ్రా షరీఫ్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శీతలా మాత ఆలయం సోమవారం తెల్లవారుజామున రక్తసిక్తమైంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో జరిగిన భారీ తొక్కిసలాటలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. పండుగ వాతావరణం నెలకొన్న ఆలయ ప్రాంగణం క్షణాల్లో ఆర్తనాదాలతో మిన్నంటింది.

 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శీతలా మాతకు పూజలు నిర్వహించేందుకు తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. అయితే, ఆలయ తలుపులు తీసిన వెంటనే ఒక్కసారిగా తోపులాట మొదలైంది. పరిమితికి మించి భక్తులు లోపలికి దూసుకురావడంతో నియంత్రణ తప్పింది. ఈ క్రమంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరి ఆడక ఎనిమిది మంది అక్కడికక్కడే కన్నుమూశారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, వృద్ధులు ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన పది మందిని వెంటనే సమీపంలోని మోడల్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

 

అయితే ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భద్రతా ఏర్పాట్లలో వైఫల్యం ఉందా? లేదా అకస్మాత్తుగా పెరిగిన రద్దీ వల్ల ఈ అనర్థం జరిగిందా? అనే కోణంలో విచారణకు ఆదేశించారు. భక్తుల భద్రత కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. భక్తుల మరణంతో మఘ్రా షరీఫ్ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *