ఎన్టీఆర్ ‘డ్రాగన్’పై క్లారిటీ ఇచ్చిన టోవినో థామస్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘ఎన్టీఆర్‌నీల్’ (‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారు) మూవీలో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై హీరో రియాక్ట్ అయ్యారు. టొవినో థామస్ (Tovino Thomas), కయదు లోహన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘పళ్లిచట్టంబి’ (Pallichattambi). ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య, చైతన్య, చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

 

‘ఎన్టీఆర్‌నీల్’ సినిమాలో ఎందుకు చేయడం లేదంటే?

ఈ కార్యక్రమానికి హాజరైన హీరో టొవినో థామస్‌ని మీడియా ‘ఎన్టీఆర్‌నీల్’ (NTRNeel) సినిమాలో చేస్తున్నారంట కదా? అని అడిగితే.. ‘‘ఆ సినిమా కోసం డేట్స్ కేటాయించడం ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా కష్టతరమైన పని. ప్రస్తుతం నేను వేరే సినిమాలు కమిటయ్యాను. నాకు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడం ఇష్టం ఉండదు. ఒకటి పూర్తి అయిన తర్వాత మరో సినిమా చేసుకుంటూ వెళతాను. మలయాళ సినిమాల మేకింగ్‌తో పోల్చితే.. తెలుగు సినిమాల మేకింగ్‌ చాలా భిన్నంగా ఉంటుంది. తెలుగు సినిమాలకు ఎక్కువ షెడ్యూల్స్ ఉంటాయి. ఒక పెద్ద తెలుగు సినిమాలో చేసే టైమ్‌లో.. మలయాళంలో నాలుగైదు సినిమాలు చేసుకోవచ్చు. అందుకే ఆ సినిమా చేయడం లేదు’’ అంటూ టొవినో థామస్‌ స్పష్టత నిచ్చారు.

 

ప్యాషనేట్ టీమ్ తోడే కారణం..

‘పళ్లిచట్టంబి’ గురించి చెబుతూ.. ‘‘డైరెక్టర్ డిజో, నేను ఒక ప్రాజెక్ట్ చేయాలని గత కొన్నేళ్లుగా అనుకుంటున్నాం. అది ఇప్పటికి కుదిరింది. 50వ దశకం నేపథ్యంలో సాగే చిత్రమిది. అప్పటి వాతావరణం కనిపించేలా సినిమాను రూపొందించేందుకు చాలా రీసెర్చ్ చేశాం. 50వ దశకం సినిమా 2026లోని ప్రేక్షకులకు నచ్చేలా, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేశాం. ఎంతో ప్యాషనేట్ టీమ్ తోడు లేకుంటే ఇలాంటి మూవీ తెరకెక్కించడం సాధ్యం కాదు. ఈ జర్నీలో డిజో, నేను ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని కూడా డిస్కషన్స్ చేసుకున్నాం. ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు డిజో. ప్రొడ్యూసర్ చరణ్, చైతన్య, చాణక్య ఒక టీమ్‌లా వర్క్ చేసుకుంటూ.. తమ కలల్ని నిజం చేసుకుంటున్నారు. నౌఫల్, బ్రిజీష్ లాంటి మంచి నిర్మాతలు లేకుంటే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. వాళ్లిద్దరు మూవీకి బ్యాక్ బోన్‌లా ఉన్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ‘పళ్లిచట్టంబి’ మనందరి మూవీ కాబోతోంది’’ అని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *