ఖరీఫ్ 2026లో రాష్ట్రంలో మొత్తం పంట విస్తీర్ణం సుమారు 60.60 లక్షల హెక్టార్లకు చేరుకునే అవకాశముందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సీజన్లో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలు సాగు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముందస్తు యూరియా నిల్వల కోసం వ్యవసాయశాఖ అధికారులు న్యూఢిల్లీలోని కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని, యూరియా సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ సెక్రటరీని ఆదివారం అదేశించారు.
ఇబ్బందులు లేకుండా..
రాష్ట్రంలో సాధారణంగా జూన్, జులై నెలలలో యూరియాకు డిమాండ్ ఎక్కువగా ఉండి, అమ్మకాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లోనే ముందస్తుగా యూరియాను కేంద్రం నుంచి తెప్పించి నిల్వలు ఉంచుకునట్లైతే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పంపిణీ చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే యూరియా పక్కదారి పట్టకుండా, యూరియా పంపిణీని పకడ్బందీగా నిర్వహించేందుకు యూరియా యాప్ ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ విధానం ద్వారా ఎరువుల కోసం రైతులు లైన్లలో నిలబడి ఇబ్బంది పడకుండా వారికి అవసరమైన సమయానికి, వారి పంట విస్తీర్ణానికి అనుగుణంగా, సమీప యూరియా విక్రయకేంద్రాల ద్వారా ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ , మే నెలల్లో..
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన యూరియా కోటాను సమర్థవంతంగా పొందేందుకు, అలాగే జూన్, జులై నెలల్లో ఏర్పడే అధిక డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ముందస్తు నిల్వలు ఏర్పరచేందుకు, కేటాయించిన యూరియాలో ఏప్రిల్ , మే నెలల్లో నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా జరిగేలా న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఎరువుల శాఖ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి తగిన యూరియా కేటాయింపును సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు వ్యవసాయ సంచాలకులు డీల్లీకి వెళ్లాలని మంత్రి ఆదేశించారు.