ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. అందుకే అసెంబ్లీలో రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు బిల్లును ప్రవేశపెట్టారు.దీనిని ఏపీ అసెంబ్లీ కాసేపటి కిందటే ఆమోదించింది. అనంతరం దీనిని కేంద్రానికి పంపించనున్నారు. అక్కడ కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటులో దీనికి ఆమోదం లభిస్తే ఇక ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి కొనసాగనుంది.కేంద్ర ప్రభుత్వం దానిని అధికారికంగా గుర్తించినట్టు అవుతుంది. మరల దీనిని మార్చాలంటే మరల పార్లమెంట్ ఆమోదం ద్వారానే సాధ్యం కానుంది.
అమరావతే ఏపీ రాజధాని..
2014లో ఏపీ, తెలంగాణ విడిపోయిన సమయంలో హైదరాబాద్ను పదేండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. అయితే, ఏపీ మాత్రం 2016లోనే ఇక్కడి ఉద్యోగులు, ఆస్తులు అన్నింటిని ఏపీకి తరలించుకుంది. సొంత రాష్ట్రంలో రాజధానిని ఏర్పాటు చేసుకుని , అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉద్యోగులను అక్కడకు తరలించింది. కేవలం రెండేండ్ల పాటు మాత్రమే హైదరాబాద్ను కేపిటల్ గా నాటి సీఎం చంద్రబాబు పాలన కోసం ఉపయోగించుకున్నారు. రెండు రాష్ట్రాల నడుమ ఆస్తుల విభజన, ఉద్యోగుల విభజనకే చంద్రబాబు టర్మ్ పూర్తయింది. అప్పటికే అమరావతిని రాజధానిగా ప్రకటించడం, అక్కడ తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు సైతం ఏర్పాటు చేశారు. కేంద్రం సైతం అమరావతినే నాడు ఏపీ రాజధానిగా గుర్తించింది.
జగన్ పాలనలో గందరగోళం..
చంద్రబాబు టర్మ్ పూర్తయ్యాక ఏపీలో వైసీపీ పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాజధానిని ప్రస్తావిస్తూ గతంలో తమిళనాడు, తెలంగాణతో ఏపీ విడిపోయినప్పుడల్లా స్థిరమైన రాజధాని లేకుండాపోయిందని పేర్కొన్నారు. అందుకే ఒకే దగ్గర అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదని పేర్కొంటూ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ఆర్థిక, న్యాయ, పరిపాలన పేరిట మూడు రాజధానులను ప్రతిపాదించారు. అందుకోసం అమరావతి, విశాఖ, కర్నూలు ప్రాంతాలను ఎంపిక చేశారు. జగన్ మాత్రం విశాఖ కేంద్రం తన పాలనను కొనసాగించారు. ఇలా తన ఐదేండ్ల పదవీకాలంలో రాజధానిని ఫిక్స్ చేయకుండా..అభివృద్ధిని గాలికి వదిలేశారు. ఫలితంగా పెట్టుబడులు రాకపోగా అప్పులు భారీగా పెరిగాయి.
అయితే, జగన్ హయాంలో తీసుకొచ్చిన మూడు రాజధానుల పాలసీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. పార్లమెంటులో టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిస్తూ ఏపీ రాజధానిగా అమరావతినే కేంద్రం గుర్తిస్తున్నదని.. మూడు రాజధానుల అంశాన్ని తమ పరిధిలో లేదని స్పష్టంచేసింది.ఈ క్రమంలోనే మరల రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన రాజధానిని మార్చకుండా.. అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉండేందుకు రాజధానికి చట్టబద్ధత కల్పించాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. అందుకే అమరావతికి చట్టబద్ధతను కల్పించే బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించనున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు జగన్ దీనికి మద్దతు ఇస్తారా? లేదా? అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.ఒకవేళ వైసీపీ ఎంపీలు అమరావతి బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే జనం దృష్టిలో, అమరావతి రైతుల దృష్టిలో జగన్ విలన్ కాక తప్పదు.ఒకవేళ మద్దతు ఇస్తే ఇక మూడు రాజధానుల అంశాన్ని ఆయన మర్చిపోవాల్సి ఉంటుంది. ఎటూ చూసిన ఇరకాటంలో వైసీపీ పార్టీ ఉన్నదని టాక్ వినిపిస్తోంది.