రాజధాని అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అమరావతి చట్టబద్ధత, ఇంధన రంగ సంస్కరణలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర విభజన చట్టంలో కొత్త రాజధాని అనే పదాన్ని తొలగించి సీఆర్డీఏ (CRDA) పరిధిలోని అమరావతి పేరును అధికారికంగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఎల్లుండి అసెంబ్లీలో నాలుగు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిపి తీర్మానం చేయనున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం ద్వారా చట్ట సవరణ బిల్లు పెట్టించేందుకు కసరత్తు చేస్తోంది. రాజధాని చరిత్రను భావి తరాలకు తెలిసేలా చేయాలని సీఎం సూచించారు. వీటితో పాటు నీరుకొండలో ఎస్ఆర్ఎం (SRM) వర్సిటీ విస్తరణకు, 60 మీటర్ల ఎత్తు వరకు అకడమిక్ భవనాల నిర్మాణానికి క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.
న్యాయవ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్రవ్యాప్తంగా 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వడ్డెర సంఘాలకు ఖనిజ లీజుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తూ.. ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించారు. కుప్పం బాలికల పాఠశాలలో పీఈటీ, నర్సు, రికార్డు అసిస్టెంట్ పోస్టుల మంజూరుకు ఆమోదం లభించింది. అలాగే, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విద్యుత్ వ్యవస్థపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం చంద్రబాబు, రాబోయే రోజుల్లో సాంకేతికతతో సంస్కరణలు తీసుకురావాలని ఆదేశించారు. ఏప్రిల్ 5 నుంచి 14వ తేదీ లోపు ప్రతి నియోజకవర్గంలో 2 వేల చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించాలని, 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయంలో 99 శాతం జీతాలకే సరిపోతోందని, కేంద్ర సాయాన్ని అప్పులు తీర్చేందుకు వాడుతున్నామని తెలుపుతూనే.. కేంద్ర పథకాలను గరిష్టంగా వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు.