తిరుపతి జిల్లా రైల్వే కోడూరు రాజకీయాల్లో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, మహిళా ఉద్యోగి హర్ష వీణ మధ్య నడుస్తున్న వివాదం.. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా హర్ష వీణ విడుదల చేసిన ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. తనపై జరిగిన అన్యాయంపై ప్రభుత్వం, పార్టీ స్పందించకపోతే తీవ్ర నిర్ణయం తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.
తనకు న్యాయం జరగకపోతే జనసేన పార్టీ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హర్ష వీణ సంచలన ప్రకటన చేశారు. మహిళల పట్ల పవన్ కల్యాణ్ గారికి ఉన్న గౌరవం, ఆయన సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతోనే తాను ధైర్యంగా బయటకు వచ్చానని ఆమె పేర్కొన్నారు. తాను ఫేమ్ కావడానికి ఇదంతా చేయడం లేదని, తన ఆరోపణల్లో నిజం లేకపోతే ఏ శిక్షకైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. త్రిసభ్య కమిటీ వేసినప్పుడే తాను సగం విజయం సాధించానని భావించానని, కానీ ఆ రిపోర్ట్ ఏమైందో తెలియకుండానే ఎమ్మెల్యే తిరిగి జనం మధ్య తిరుగుతున్నారని ఆమె ప్రశ్నించారు.
ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చిన సమయంలో ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టాలని సూచించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై ఏం సమాధానం చెబుతారని ఆమె నిలదీశారు. అధికారం ఉందని మీరు ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారా అని ప్రశ్నిస్తూ, తన మరణం తర్వాతైనా తనకు న్యాయం చేయాలని కోరుకుంటారేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఉన్నారనే ధైర్యంతోనే ఒక ఎమ్మెల్యేపై పోరాటానికి దిగానని, కానీ ఇప్పుడు అందరూ కలిసి అన్యాయం చేయాలనుకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత, అంటే జనవరి 24 నుండి ఆఫీసుకు రాకుండా ఉన్న హర్ష వీణ, మార్చి 25న తిరిగి రైల్వే కోడూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో విధులకు హాజరయ్యారు. అదే సమయంలో, గత ఐదు రోజుల క్రితమే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా తిరిగి బహిరంగంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఇద్దరూ తిరిగి విధుల్లోకి, బహిరంగ రంగంలోకి రావడంతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నియోజకవర్గంలో నెలకొంది.