ఫార్ములా ఈ రేసు కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ తాము తెస్తున్న ప్రైవేటు బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ప్రభుత్వం ఫార్ములా కేసు చార్జిషీట్ను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. సీఎం సంతకం చేసిన తొలి ఫైలు కనిపించడం లేదనే విషయాన్ని తాము బయటపెట్టడంతో సర్కారు ఇరకాటంలో పడిందన్నారు.
ఈ కేసులో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వమే చార్జిషీట్లో ఒప్పుకుందని ఆయన తెలిపారు. బ్యాంక్ నుంచి పంపిన రూ. 45 కోట్ల నిధులు సంస్థ అకౌంట్లో భద్రంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రం నుంచి వెళ్లిన నిధులు ఎక్కడా దారి మళ్లలేదని స్పష్టం చేశారు. కేవలం రూ. 45 కోట్లు పంపితే రూ. 600 నుంచి రూ. 700 కోట్లు అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అనుచిత లబ్ధి పొందినట్లు ఆరోపిస్తున్న వారి పేర్లే చార్జిషీట్లో లేవని ఈ కేసు కోర్టులో నిలబడదని పేర్కొన్నారు. హైదరాబాద్ ఖ్యాతి పెంచడానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ రేసు నిర్వహించామన్నారు. దీనివల్ల వారం రోజుల్లోనే రాష్ట్రానికి రూ. 700 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందని నీల్సన్ అనే సంస్థ స్పష్టం చేసిందని గుర్తుచేశారు.
అందాల పోటీల నిర్వహణ వల్ల రాష్ట్రానికి పైసా ప్రయోజనం లేకపోగా తెలంగాణ పరువు పోయిందని ఆరోపించారు. మిస్ యూకే చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో అంతర్జాతీయంగా రాష్ట్ర అప్రతిష్ట పాలైందన్నారు. సీఎం సరదా ఫుట్బాల్ మ్యాచ్ కోసం రూ. 100 కోట్లు వృథా చేశారని మండిపడ్డారు. అయినా ఏ కాంగ్రెస్ నేతపై కేసులు పెట్టలేదని తప్పుబట్టారు. రాజకీయ కక్షతో అధికారులను వేధించడం సరికాదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
మూసీ ప్రక్షాళనపై ఎలాంటి ప్రణాళిక లేదని కేవలం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చే నిధుల కోసమే ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆరోపించారు. భయాందోళనల్లో ఉన్న ప్రజలతో చర్చించి వారిని ఒప్పించిన తర్వాతే ప్రాజెక్టు చేపట్టాలని హితవు పలికారు. డీలిమిటేషన్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2014లోనే జరగాల్సి ఉందని.. ఇప్పుడు జరిగినా స్వాగతిస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సీట్లు పెరిగితే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
టీడీఆర్ వ్యవహారం అతిపెద్ద కుంభకోణమని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్రెడ్డి కుటుంబ సభ్యులు అనుచరులు దీనిని కొనుగోలు చేస్తూ భారీ స్కామ్కు తెరలేపుతున్నారని విమర్శించారు. టీడీఆర్లను బలవంతంగా కొనేలా రియల్ ఎస్టేట్ సంస్థలను ప్రభుత్వం ఆదేశిస్తోందని మండిపడ్డారు. టీడీఆర్ అంటే తిరుపతిరెడ్డి డెవలప్మెంట్ రైట్స్గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రెస్మీట్ పెట్టి ఈ స్కామ్ను పూర్తిగా ఆధారాలతో సహా బయటపెడతానని స్పష్టం చేశారు.