జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం చేశాడు: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ సంచలన నోటరీ!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ తొలిసారిగా అధికారికంగా స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక అడ్వొకేట్ నోటరీని విడుదల చేస్తూ, కుటుంబ ఆస్తులపై కీలక వివరణ ఇచ్చారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడి కుటుంబ ఆస్తులేనని, వాటిని నలుగురు మనుమలకు సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ ఆదేశమని ఆమె స్పష్టం చేశారు.

కుమారుడు జగన్ తీరుపై విజయమ్మ ఈ లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంవోయూ (MOU)లో షర్మిలకు రాసిన ఆస్తులన్నీ న్యాయంగా ఆమెకు దక్కాల్సినవేనని, నిజానికి షర్మిలకు రావాల్సిన వాటా కంటే తక్కువగా రాశారని పేర్కొన్నారు. సరస్వతి సిమెంట్స్ మరియు యెలహంక భూములు కూడా షర్మిలవేనని, జగన్ ఇచ్చానని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు సంబంధించిన డివిడెండ్ మాత్రమేనని వివరించారు. ఈ విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆస్తుల పంపిణీ విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను విజయమ్మ ఖండించారు. జగన్ మరియు షర్మిల ఇద్దరికీ వైఎస్సార్ సమానంగా ఆస్తులు ఇచ్చారని, అది కేవలం బాధ్యతల అప్పగింత మాత్రమే తప్ప పూర్తిస్థాయి పంపకం కాదని అన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తూ కుటుంబ గౌరవాన్ని తగ్గించవద్దని, మీడియాలో ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించవద్దని ఆమె చేతులు జోడించి వేడుకున్నారు. దేవుని సాక్షిగా తాను రాసినవన్నీ వాస్తవాలని, ఇప్పటికైనా తన కొడుకు జగన్ న్యాయం చేస్తాడని ఆశిస్తున్నట్లు విజయమ్మ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *