తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఇకపై రాష్ట్రంలో పదో తరగతి (SSC) బోర్డు పరీక్షలు ఉండబోవని సంచలన ప్రకటన చేశారు. జాతీయ స్థాయి విద్యా విధానానికి అనుగుణంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే గొడుగు కింద విద్యా బోధన జరిగేలా ప్లస్ 2 (+2) విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోందని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (SSC) బోర్డును రద్దు చేసి, విద్యా వ్యవస్థను మరింత సరళతరం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. విద్యా శాఖ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయాలు ఉంటాయని, కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ను రూపొందించామని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అమలులో ఉన్న అత్యుత్తమ విద్యా పద్ధతులను అధ్యయనం చేసిన తర్వాతే రాష్ట్రంలో పూర్తిస్థాయి మార్పులు చేపడతామని స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో రాజకీయ అంశాలపై కూడా రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ పూర్తయిన తర్వాతే చర్యలు ఉంటాయని, గత పదేళ్లలో వేల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల అమలుకు తమ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని, మూసీ ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని పునరుద్ఘాటించారు. బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.