తెలంగాణలో వాహనదారులకు రెడ్ అలర్ట్. ట్రాఫిక్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది రవాణా శాఖ. పెండింగ్ చలాన్లు, వాటిపై రానున్న వివాదాల పరిష్కారం కోసం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు తప్పవు. అసలు మేటరేంటి?
తెలంగాణలో వాహనదారులకు అలర్ట్
తెలంగాణలో వాహనదారులకు ముఖ్య గమనిక. వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. కేవలం ట్రాఫిక్ ఉల్లంఘన మాత్రమే చలాన్లు పెండింగ్ లో ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి నిబంధనలు రెడీ చేస్తున్నట్లు సమాచారం.
చీటికి మాటికీ నిబంధనలు అతిక్రమించినా, జరిమానాలు కట్టకపోయినా ఇబ్బందులు ఇకపై తప్పవు. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ స్తంభింప జేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. చలాన్లు సమయంలో వచ్చే వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
కొత్త రూల్స్ రెడీ.. తేడా వస్తే వాహనదారులకు ఇబ్బందులు తప్పవు
మోటార్ వాహన నిబంధనలకు అనుగుణంగా జరిమానాలపై వచ్చే అభ్యంతరాలను వేగంగా పరిష్కరించేందుకు కొత్తగా గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి రేపోమాపో నోటిఫికేషన్ రానుంది. కొత్త విధానంలో వాహనదారులు తమ ఫిర్యాదులను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలి.
ఏమైనా సాంకేతిక లోపాలు, డేటా ఎంట్రీలో పొరపాట్లు, వాహనాలు అమ్మిన తర్వాత ఉండే చలాన్ల వంటి సమస్యలను ఆ శాఖ అధికారులు నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ కమిషనరేట్లలో ట్రాఫిక్ డీసీపీలు, జిల్లాల ఎస్పీలు, రవాణా శాఖలో ఆర్టీవోలు గ్రీవెన్స్ అధికారులుగా వ్యవహరించనున్నారు. చలాన్లు జారీ నుంచి చెల్లించే వరకు కాలపరిమితులను నిర్దేశించింది.
కెమెరా ఆధారిత చలాన్లకు కేవలం మూడు రోజులు, మాన్యువల్ చలాన్ అయితే రెండువారాలులోగా వాహనదారుడికి పంపాలి. చలాన్ అందిన 45 రోజుల్లో వాహనదారుడు జరిమానా కచ్చితంగా కట్టాలి. లేదంటే దానికి అభ్యంతరాలను ఆన్లైన్లో తెలపాలి. ఫిర్యాదు అందిన నెలలోపు అధికారులు దాని గురించి తమ నిర్ణయాన్ని వెల్లడించాలి.
అధికారుల నిర్ణయంపై వినియోగదారుడు అసంతృప్తిగా ఉంటే చలాన్ మొత్తంలో 50 శాతం చెల్లించి కోర్టును ఆశ్రయించవచ్చు. ఒక వాహనానికి ఏడాదిలో ఐదు కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉంటే సమాచారం రవాణా శాఖకు చేరనుంది. వెంటనే సంబంధిత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఆర్సీని అధికారులు బ్లాక్ చేసే అవకాశం ఉంది.
బ్లాక్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఫిట్నెస్, యాజమాన్య బదిలీ వంటివి సేవలు పొందడం దాదాపు అసాధ్యం. పెండింగ్లో ఉన్న చలాన్లు పూర్తి చేసిన తర్వాత ఆయా సేవలను తిరిగి రవాణా శాఖ పునరుద్ధరించనుంది. కొత్త నిబంధనల నేపథ్యంలో వాహనదారుల్లో బాధ్యతను పెంచుతుందని భావిస్తున్నారు.