మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు దర్యాప్తును తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ కేసు విచారణ కోసం తొమ్మిది మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో ఈ బృందం పనిచేయనుంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన మద్యం పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగిందన్న ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కలకలం సృష్టించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గత శనివారం రాత్రి ఈగల్ పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో ఉన్న 11 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, పైలట్ రోహిత్ రెడ్డి మరియు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్తో సహా ఆరుగురికి పాజిటివ్ అని తేలింది. సోదాల సమయంలో పోలీసులపైకి నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరపడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితేశ్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వీరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో, నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు. మిగిలిన ఎనిమిది మందికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఈ ముఠా వెనుక ఉన్న డ్రగ్స్ నెట్వర్క్ మరియు ఇతర ఆర్థిక లావాదేవీల గురించి సిట్ అధికారులు ఇప్పుడు లోతుగా విచారణ జరుపుతున్నారు.