పొగమంచు గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

చలితో తెలుగు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి. తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. గుడిహత్నూర్, బెజ్జూరు, ఇచ్చోడ మండలాల్లో పొగ మంచు దట్టంగా కమ్మేసింది. దీంతో వాహనదారులు లైట్ల వెలుగులోనే ప్రయాణం సాగిస్తున్నారు. హైద్రాబాద్ లోనూ చలి ప్రభావం చూపుతోంది. మరో రెండ్రోజులు చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

 

తూర్పు, ఆగ్నేయ దిశ మీదుగా వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

 

ఏపీలోనూ చలి పంజా విసురుతోంది. ప్రత్యేకించి ఏజెన్సీ ఏరియాల్లో చలితో గజగజ వణుకుతున్నారు. పొగమంచు దట్టంగా కమ్మేస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత ప్రభావం ఉంది.అరకు లోయ, చింతపల్లి, పాడేరు మండలాల్లో అత్యల్పంగా 10 డిగ్రీల కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవువుతున్నాయి.

 

చలి తీవ్రత కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి చిన్నారులు,వృద్ధులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *