బీమా కాలువకు ఆరేళ్లుగా గండి.. అధికారులపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం నాగర్లబండ తండా శివారులో రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ (ప్యాకేజీ-16) ప్రధాన కాలువకు ఏర్పడిన గండిని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2019లో కాలువ తెగిపోయి ఆరేళ్లు గడుస్తున్నా నేటికీ మరమ్మతులు చేపట్టకపోవడంపై ఆయన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోయినా, 16,666 ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు కాగితాల్లో తప్పుడు నివేదికలు చూపడంపై అధికారులను నిలదీశారు. కాలువ తెగిపోవడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు అందక తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన మండిపడ్డారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాలువ పనులను ఈపీసీ (EPC) ఒప్పందం కింద చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఈ దుస్థితి కలిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం మరియు కాంట్రాక్టర్ మధ్య ఒప్పందం ఇంకా ముగియనందున, కాలువ మరమ్మతులు మరియు ఇతర పెండింగ్ పనుల బాధ్యత పూర్తిగా కాంట్రాక్టరుదేనని స్పష్టం చేశారు. కేవలం కాగితాల్లో గణాంకాలు చూపడం మాని, వాస్తవంగా రైతులకు నీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులకు సాగునీరు అందించే విషయంలో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదని మంత్రి జూపల్లి హెచ్చరించారు. తక్షణమే కాలువ గండిని పూడ్చడంతో పాటు మైనర్లు, సబ్ మైనర్ పనులను పూర్తి చేసి చివరి ఎకరా వరకు సాగునీరు అందించాలని అధికారులకు గడువు విధించారు. క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసి రైతులకు భరోసా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో స్థానిక రైతులు తమ ఇబ్బందులను మంత్రికి వివరించగా, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *