తేది:09-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: ఐసిడిఎస్ డైరెక్టర్ శ్రుతి ఓజా సోమవారం మెదక్ జిల్లాలోని అంగన్వాడీ మరియు సఖి కేంద్రాలను సందర్శించి మహిళా, శిశు సంక్షేమ సేవల అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రెడ్డిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడి సిబ్బందితో మాట్లాడి పిల్లలు, గర్భిణీలు మరియు బాలింతలకు అందిస్తున్న సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు.
పర్యటనలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న ప్రాథమిక సదుపాయాలు, పోషకాహార సరఫరా, ప్రీ-స్కూల్ కార్యకలాపాలను సమీక్షించారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసి పిల్లల ఆరోగ్యం, పోషణపై మరింత శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
తదుపరి ఆమె మెదక్లోని బాల సదనం–సఖి కేంద్రాన్ని సందర్శించి అక్కడ నమోదు అవుతున్న గృహ హింస (DV) కేసులను సమీక్షించారు. బాల సదనం భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి 99 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు శ్రుతి ఓజా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్తో సమావేశమై జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరియు సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ తనిఖీలలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి హేమ భర్గవి, ఐసిడిఎస్ సీడీపీవోలు మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు.