ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని సాకుగా తీసుకుని వార్తా ఛానళ్లు అనుసరిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ధ క్షేత్రం నుంచి వార్తలను అందించే క్రమంలో అనేక ఛానళ్లు పరిమితులు దాటుతున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గుర్తించింది. అనవసరమైన ఉద్వేగాలను రెచ్చగొట్టడం.. వాస్తవ దూరమైన ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడం వంటి చర్యలను ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఇటువంటి సంచలన వార్తల వల్ల యుద్ధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని మంత్రిత్వ శాఖ ఆవేదన వ్యక్తం చేసింది.
యుద్ధం వంటి సున్నితమైన అంశాల్లో వార్తా ప్రసారాలు బాధ్యతాయుతంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే రేటింగ్ల దృష్టిలో పడి కొన్ని సంస్థలు వార్తలను వక్రీకరిస్తున్నాయని.. ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నాయని ప్రభుత్వం వివరించింది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు కఠిన నిర్ణయం తీసుకోవడం అనివార్యమని భావించింది. ఇందులో భాగంగా బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) సంస్థకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే న్యూస్ ఛానళ్ల టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) నిలిపివేయాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రస్తుతానికి ఈ నిషేధం నాలుగు వారాల పాటు అమలులో ఉంటుంది. అవసరమైతే మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇది కొనసాగుతుందని కేంద్రం వెల్లడించింది. కేవలం రేటింగ్ల కోసం పోటీ పడుతూ జర్నలిజం విలువలను పక్కన పెట్టే ధోరణికి అడ్డుకట్ట వేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న వారు.. అక్కడ స్నేహితులు బంధువులు ఉన్న వారు ఇటువంటి వార్తా కథనాల వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ప్రభుత్వం గమనించింది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వార్తా ఛానళ్లు ఇకనైనా తమ ప్రసారాల్లో సంయమనం పాటించాలని హితవు పలికింది. టీఆర్పీల కోసం కాకుండా.. వాస్తవాలను మాత్రమే ప్రజలకు చేరవేయాలని సూచించింది. దేశ భద్రత.. ప్రజల మానసిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని మీడియా సంస్థలు వ్యవహరించాలని ప్రభుత్వం కోరింది. నిబంధనలు ఉల్లంఘించే ఛానళ్లపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించింది.