తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. 2023 ఎన్నికల్లో ప్రజాపాలన రావాలని కోరుకున్న ఉద్యోగుల కష్టం వల్లే ఈ ప్రభుత్వం ఏర్పడిందని కృతజ్ఞతలు తెలిపారు. గతంలో అధికార యంత్రాంగం లేకపోయినా.. అక్రమ కేసులు ఎదుర్కొంటూనే ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. వర్గీకరణ కోసం జరిగిన 30 ఏళ్ల పోరాటానికి తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలోనే వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని గర్వంగా ప్రకటించారు.
వర్గీకరణ పోరాటంలో తాను ఎందుకు అండగా నిలబడ్డానో వివరిస్తూ మహాభారతంలోని కర్ణుడు, బార్బరి పాత్రలను ఉదహరించారు. కర్ణుడు మిత్రధర్మం కోసం ఎలా నిలబడ్డారో.. తాను కూడా మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడ్డానని చెప్పారు. బలహీనుల పక్షాన నిలబడటమే భీమసేనుడి కుమారుడి లక్షణమని.. న్యాయం మీ వైపు ఉంది కాబట్టే తాను రాజకీయ రిస్క్ తీసుకుని మరీ ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. వర్గీకరణ అమలు తర్వాత కూడా ప్రమోషన్లు, ఉన్నత విద్య, భూముల రక్షణ వంటి సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. తాను ముందుండి పోరాడుతున్నప్పుడు వెనుక నుంచి జరిగే రాజకీయ దాడులను జాతి అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులే ఈ పాలనకు కళ్లు, చెవులు అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరడంలో ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలన్నారు. 99 రోజుల కార్యాచరణ ద్వారా రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని కోరారు. ఖజానా ఖాళీగా ఉన్నా.. ఆర్థిక భారాలున్నా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలకు 1000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని.. పన్నుల వసూలులో ఉద్యోగులు కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని సూచించారు.
గత ప్రభుత్వం జాతిని గొర్రెలు, బర్రెలు, చేపలు పట్టుకోవడానికే పరిమితం చేయాలని చూసిందని విమర్శించారు. తన ప్రభుత్వం మాత్రం ఈ జాతి బిడ్డలను డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమాజంలో మాదిగ బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని.. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మారి రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న సామాజిక న్యాయం సిద్ధిస్తుందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం పనిచేస్తానని.. ఈ పదవిని పదిమందికి ఉపయోగపడేలా వినియోగిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.