యుద్ధం వేళ.. భారత్‌కు ఇరాన్ గుడ్ న్యూస్.. !

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం భారత్ పై తీవ్ర ఒత్తిడిని పెంచిన సంగతి తెలిసిందే. భారత్ కు చమురు సరఫరా చేసేందుకు కీలక మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిందన్న వార్తలు.. తీవ్ర ఆందోళనకు దారి తీశాయి. అదే నిజమైతే భారత్ కు వచ్చే చమురు నిలిచిపోయి.. దేశంలోని ఇంధన నిల్వలు అడుగుంటుతాయన్న భయాందోళనలు చెలరేగాయి. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేశారు. అయితే ఈ భయాలను ఇరాన్ ఒక్క ప్రకటనతో పటాపంచలు చేసింది. యుద్ధ సమయంలో భారత్ కు తీపికబురు అందించింది.

 

ఇరాన్ ప్రకటన ఏంటంటే?

ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRIB) తాజాగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం హర్మూజ్ జలసంధి గుండా రాకపోకలను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అయితే యుద్ధానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు యూరప్ దేశాల ఓడలకు ఈ మార్గం గుండా రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు రివల్యూషనరీ గార్డ్స్ వెల్లడించినట్లుగా ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ (IRIB) పేర్కొంది. దీంతో భారత్ కు చమురును మోసుకొచ్చే ఓడలు.. ఎలాంటి అడ్డంకులు లేకుండానే హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించనున్నాయి.

 

‘మాకు ఆ హక్కు ఉంది’

మరోవైపు తాజా ప్రకటనలోనే హర్మూజ్ జలసంధిపై తమకున్న నియంత్రణ గురించి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చాటుకున్నాయి. ఆ జలసంధి గుండా ఏ ఏ దేశాల ఓడలు వెళ్లాలో నిర్ణయించే హక్కు తమకు ఉందని పేర్కొన్నాయి. ఈ విషయాన్ని తాము గతంలోనే నొక్కి చెప్పామని తెలిపాయి. అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ వాటికి మద్దతుదారులకు చెందిన ఏ నౌకలైన జలమార్గంలో కనిపిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని IRGC చెప్పినట్లుగా IRIB పేర్కొంది.

 

చమురు ధరలపై ప్రభావం

ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సైనిక చర్యలు మెుదలు కాగా.. అప్పటి నుంచి హర్మూజ్ జలసంధిలో రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో అంతర్జాతీయ చమురు ధరలపై దీని ప్రభావం స్పష్టం కనిపించింది. అయితే చైనాకు చెందిన నౌకలను మాత్రమే హర్మూజ్ జలసంధి గుండా అనుమతి ఇస్తామని ఇరాన్ మంగళవారం ప్రకటించింది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ మినహా అన్ని దేశాల ఓడలను అనుమతిస్తామని చెప్పడం భారత్ కు ఊరటను కలిగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *