మళ్లీ ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం..!

కేంద్రప్రభుత్వం రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మూడు నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను ఒకేసారి అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు (ఎండలు) పెరుగుతుండటంతో పేదలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టింది. అన్ని రాష్ట్రాలకు గురువారం కేంద్రం లేఖలు రాసింది. రేషన్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

 

మార్చి మొదటి వారంలో..

రోజూరోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పేదలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రేషన్ కార్డు లబ్ధిదారులకు 3 నెలల రేషన్ సరుకులను ఒకేసారి అందించేందుకు సిద్ధమైంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే అందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ అధికారులు లేఖలు రాశారు. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతుండగా.. రానున్న రోజుల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికల నేపథ్యంలో చర్యలు చేపట్టింది.

 

ఒకేసారి 18 కేజీల పంపిణీ..

తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఒక్కో లబ్దిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ప్రతీ నెల తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో 1,05,07,879 రేషన్ కార్డులు ఉండగా, 3కోట్లకు పైగా లబ్దిదారులు ఉన్నారు. ప్రతీ నెల 2.13 లక్షల మెట్రిక్ టన్నులు పంపిణీ చేస్తున్నారు. మూడు నెలలకు 6.39లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నారు. అంటే ఒక్కో లబ్దిదారుడికి ఒకేసారి 18 కేజీల పంపిణీ అందజేయబోతున్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *