తెలంగాణలో భూసేకరణకు ప్రభుత్వం 500 కోట్లు విడుదల..

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల నిధులు విడుదల చేయనున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జూన్ 2 వరకు భూసేకరణ పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనర్సింహలతో కలిసి సచివాలయంలో నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో ఉన్నత స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

సింగూర్ డ్యామ్ భద్రత

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సింగూర్ డ్యామ్ భద్రత ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మహానగరానికి ప్రాణాధారంగ నిలిచిన సింగూర్ ప్రాజెక్టు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటుందని తెలిపారు. స్వయంగా తాను సింగూర్ ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షిస్తానని ప్రకటించారు. సింగూర్ ప్రాజెక్టును పరిరక్షించడంతో పాటు పునరుద్ధరణ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. జాతీయ ఆనకట్ట భద్రతా సంస్థతో పాటు, రాష్ట్ర అధికారుల నుంచి భద్రతా పరిస్థితిపై హెచ్చరికలు వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించేందుకు తక్షణ సాంకేతిక జోక్యాలు, నీటిమట్టం దిగువన అండర్‌వాటర్ పరిశీలనలు, మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

 

ప్లంజ్ పూల్ సమస్యలు

సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్ డ్యామ్ (ఎం.బాగా రెడ్డి సింగూర్ ప్రాజెక్టు)పై 2025 మధ్యకాలం నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఆ సమయంలో నిర్వహించిన అంచనాల్లో ఎంబాంక్మెంట్‌లో చీలికలు, స్లోప్ ఎరోషన్, రివెట్‌మెంట్ నష్టం, ప్లంజ్ పూల్ సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇవి దిగువ ప్రాంతాల్లో వరద ముప్పుకు దారితీసే అవకాశాలపై ఆందోళనలు రేకెత్తించాయన్నారు. 29.91 టీఎంసీల స్థూల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్ ప్రతీ సంవత్సరం హైదరాబాద్‌కు 6–7 టీఎంసీల నీటిని సరఫరా చేస్తోందని ఆయన తెలిపారు. డ్యామ్ భద్రత పటిష్టం చేసే వరకు అధిక ప్రమాదం కలిగించే ఆపరేషన్లు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.

 

సింగూర్ కాలువ లైనింగ్..

బండ్ దిగువన నీటిని పూర్తిగా వదలకుండా దాగి ఉన్న నష్టాలను గుర్తించేందుకు సోనార్ పరీక్షలు, అండర్‌వాటర్ సర్వేలు చేపట్టి 2–3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ధికారులను ఆదేశించారు. త్వరలోనే స్వయంగా ఆనకట్టను సందర్శిస్తానని ప్రకటించిన ఆయన, ఒకే సీజన్‌లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు, పంటల విరామం రాకుండా చూడాలన్నారు. సింగూర్ కాలువ లైనింగ్ పనుల మొత్తం 13 కి.మీ.లో 9 కి.మీ. పూర్తైందని, మిగిలిన 4 కి.మీ.ను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 2025 ఆగస్టులో నిల్వలను భద్ర పరిమితులకు కట్టడి చేసి, నియంత్రిత నీటి విడుదలలు ప్రారంభించినప్పుడు ఆనకట్టపై ముప్పు స్థాయి పెరిగిందని, డిసెంబర్ నాటికి దశలవారీగా నీటిమట్టాన్ని తగ్గించి ప్రధాన మరమ్మత్తులు చేపట్టినట్లు వివరించారు.

 

జూన్ 26 లోగా పూర్తి..

డ్యామ్ సేఫ్టీ ప్రభుత్వానికి ఎంతో ప్రాధాన్యత అంశం అన్నారు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన నిబంధనల మేరకు సింగూర్ డ్యాం ను పరిరక్షించాలని మంత్రులు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. సింగూరు డ్యామ్ సేఫ్టీ నిర్మాణ పనులపై టెక్నికల్ కమిటీని నియమించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఆందోల్ నియోజకవర్గం లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం డీపీఆర్ లను శరవేగంగా రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను పనులకు ఉగాదిలోగా శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టాలని మంత్రులు ఆదేశించారు. సింగూరు ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26 లోగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. సింగూర్ ప్రాజెక్టు సుందరీకరణ , పరిరక్షణ పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు దామోదర్ రాజనర్సింహ ఉత్తంకుమార్ రెడ్డి వివేక్ వెంకటస్వామి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆందోల్ నియోజకవర్గం లో చిన్న నీటి ప్రాజెక్టులైనా చెరువుల పునరుద్ధరణ పనుల టెండర్లను పూర్తి చేసి ఈ సీజన్లో రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు.

 

ములుగు రైతులకు..

ములుగు జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణకు సంబంధించి 15 రోజుల్లో అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టపరిహారం వెంటనే చెల్లించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలో ఎల్ ఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా పూర్తి చేస్తామన్నారు. రామప్ప – లక్నవరం ఇంటర్ లింకింగ్ పనులకు అదనపు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేసి ములుగు రైతులకు త్వరితగతిన సాగునీరు అందించాలని ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణపై 15 రోజుల్లో మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

 

సాగునీటి రంగ అభివృద్ధి కోసం..

సమ్మక్క సారాలమ్మ ప్రాజెక్టు విషయంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని, అక్కడ ముంపు బాధితులకు తగిన పరిహారం చెల్లించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పెండింగ్ పనుల జాప్యంపై కాంట్రాక్టర్లపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల కొనసాగింపులో ఇబ్బందులు ఉంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ములుగు జిల్లాలో సాగునీటి రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా పాలెం వాగు గేట్లు, రెగ్యులేటర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఈ శ్రీధర్, ఈఎన్సీలు రమేష్ బాబు, శ్రీనివాస్, టి.శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ శాఖ ఎస్ఈ బి రాజమ్మ, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, ఇన్చార్జి ఎస్సీ రఘునాథ్ రావు, ఈ ఈ బీమ్, డీఈ నాగరాజ్, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *