జూన్ 26 డెడ్‌లైన్.. సింగూరు కాలువల లైనింగ్ పూర్తి చేయాలని అధికారులకు మంత్రుల ఆదేశం..

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సింగూరు ప్రాజెక్టు అభివృద్ధి, డ్యామ్ సేఫ్టీపై బుధవారం కీలక సమీక్ష సమావేశం జరిగింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. సింగూరు డ్యామ్ రక్షణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సంస్థ నిబంధనల మేరకు ప్రాజెక్టును పరిరక్షించాలని, ఇందుకోసం ప్రత్యేక టెక్నికల్ కమిటీని నియమించాలని మంత్రులు సూచించారు.

 

ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మకమైన పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం డీపీఆర్ (DPR)లను శరవేగంగా రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఉగాది పండుగ లోపు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేయాలని మంత్రులు లక్ష్యంగా నిర్దేశించారు. సింగూరు ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26 లోగా పూర్తి చేసి, జూలై నెలాఖరు నాటికి రైతుల పొలాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

ప్రాజెక్టు పరిరక్షణతో పాటు సుందరీకరణ పనులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు దామోదర్ రాజనర్సింహ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి అధికారులను కోరారు. ఆందోల్ నియోజకవర్గంలోని చిన్న నీటి ప్రాజెక్టులు.. చెరువుల పునరుద్ధరణ పనుల టెండర్లను త్వరగా ముగించి ఈ సీజన్‌లోనే రైతులకు నీరు అందించాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఈఎన్సీలు రమేష్ బాబు, శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

తెలంగాణ వ్యవసాయ రంగానికి సింగూరు ప్రాజెక్టు కీలకమని.. ఏటా పెరుగుతున్న నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రిడ్ వ్యవస్థను బలోపేతం చేయాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. డ్యామ్ సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని.. పనుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను అప్రమత్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయడంలో విఫలమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా ఇరిగేషన్ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయాలని మంత్రులు దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *