పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర శత్రుత్వం ఆ ప్రాంతాన్ని పెను ప్రమాదంలోకి నెట్టివేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘర్షణ కారణంగా ఆయా దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలతో పాటు సుమారు కోటి మంది భారతీయుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. మన పౌరుల భద్రత విషయంలో నెలకొన్న ఆందోళనలు అత్యంత వాస్తవమైనవని రాహుల్ పేర్కొన్నారు.
ఏ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినా అది సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని రాహుల్ హెచ్చరించారు. ఇరాన్పై జరుగుతున్న ఏకపక్ష దాడులతో పాటు ఇతర మధ్యప్రాచ్య దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులను కూడా సమానంగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. “హింస ఎప్పుడూ హింసనే పుట్టిస్తుంది. కేవలం చర్చలు మరియు సంయమనం పాటించడం ద్వారానే శాంతిని సాధించడం సాధ్యమవుతుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తన నైతిక స్పష్టతను చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంలో, మానవ జీవితాలను కాపాడటంలో భారత్ ధైర్యంగా తన గొంతు వినిపించాలని రాహుల్ సూచించారు. సార్వభౌమాధికారం, వివాదాల శాంతియుత పరిష్కారమే మన విదేశాంగ విధానానికి ప్రాతిపదిక కావాలని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. ఒక దేశాధినేత హత్యను ప్రపంచాన్ని నడిపే మార్గంగా ప్రధాని సమర్థిస్తున్నారా అని నిలదీశారు. ప్రస్తుత తరుణంలో ప్రధాని నిశ్శబ్దంగా ఉండటం అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను తగ్గిస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు.
పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొల్పడానికి భారతదేశం చొరవ తీసుకోవాలని.. లక్షలాది మంది ప్రవాస భారతీయుల ప్రయోజనాలను కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. యుద్ధం వల్ల తలెత్తే ఆర్థిక మరియు సామాజిక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని రాహుల్ కోరారు.