ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో అప్రమత్తమైంది కేంద్రప్రభుత్వం. రోజురోజుకూ పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో హింసాత్మక పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావించింది మోదీ సర్కార్. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ లేఖలు రాసింది కేంద్ర హోం శాఖ.
ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు
అమెరికా-ఇజ్రాయెల్ మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేని మృతి చెందారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ముస్లింలోని షియా వర్గానికి చెందిన ప్రజలు రోడ్లపైకి వచ్చిన నిరసనలు చేస్తున్నారు. ఆందోళనలకు దిగుతూ అమెరికా-ఇజ్రాయెల్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం కరాచీలోని అమెరికా ఎంబసీపై దాడి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆదివారం నుంచి దేశంలోని జమ్మూకాశ్మీర్ మొదలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలు నిరసనలు, ఆందోళనకు దిగారు. పరిస్థితి గమనించిన కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది.
అలర్టయిన కేంద్ర హోం శాఖ, ఆపై రాష్ట్రాలకు లేఖ
ఈ దాడుల సమయంలో భారత్లోనూ హింసాత్మక పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇరాన్కు అనుకూలంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న రాడికల్ ప్రచారకులను గుర్తించాలని అందులో ప్రస్తావించింది. ఇలాంటి ఘటనలు మత హింసకు దారితీసే అవకాశం ఉందని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
మతపరమైన సమావేశాలలో రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది. ఏదైనా శాంతి భద్రతల సమస్యను నివారించడానికి నిఘా సమాచారాన్ని పంచుకోవడం, నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ లేఖలో నొక్కి చెప్పింది.
తాజాగా జమ్మూకాశ్మీర్లో శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో ఇరాన్కు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. వారిని కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. పరిస్థితి గమనించిన బలగాలు వారిని చెదర గొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారులను చెదర గొట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉంది. కాశ్మీర్లో పలు ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.