టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై ఒక మహిళ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సదరు బాధితురాలు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. మంత్రి నారా లోకేష్లకు తన ఆవేదనను వివరిస్తూ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలను వైకాపా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లోని మణికొండలో నివసిస్తున్న ఆమె.. గత 25 నుండి 30 ఏళ్లుగా బీఆర్ నాయుడుతో తనకు పరిచయం ఉందని.. అది క్రమంగా సంబంధంగా మారిందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తనకు సుఖం కన్నా అవమానాలు, ఆర్థిక ఇబ్బందులే మిగిలాయని ఆమె లేఖలో వాపోయారు.
బాధితురాలు తన లేఖలో బీఆర్ నాయుడి నైజంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలను లోబర్చుకోవడమే ఆయన పని అని.. తన కోరిక తీర్చకపోతే మహిళలకు ఏ చిన్న పని కూడా చేసి పెట్టడని ఆమె ఆరోపించారు. బీఆర్ నాయుడు ఒక ఉమెనైజర్ అని.. అటువంటి వ్యక్తికి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ పదవిని కట్టబెట్టడం సరికాదని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇస్తే మహిళలకు మరింత ముప్పు పొంచి ఉంటుందని.. ఇది పార్టీ పరువుకు కూడా నష్టం కలిగిస్తుందని ముఖ్యమంత్రిని వేడుకున్నారు.
మరింత హృదయవిదారకమైన విషయం ఏమిటంటే.. బాధితురాలి 16 ఏళ్ల కుమార్తె ‘SLE’ (Systemic Lupus Erythematosus) అనే ప్రాణాంతక ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతోంది. కుమార్తె వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని.. ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని బీఆర్ నాయుడు తనను మానసికంగా.. ఆర్థికంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2016 నుండి తనపై నిఘా పెట్టి వేధిస్తున్నారని.. ఎదురుతిరిగితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన కొన్ని వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో బీఆర్ నాయుడిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.